బాబుకు 'గ్రేటర్' షాక్: కెసిఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు ప్రకాశ్, సాయన్న
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో మరో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్కు పెద్దగా పట్టు లేదు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా నగరానికి చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కారు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యేలు సాయన్న (కంటోన్మెంట్), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్)లు గురువారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.
సాయన్న, ప్రకాశ్ గౌడ్లను నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకు వచ్చారు. క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా ముఖ్యమంత్రి కెసిఆర్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రకాశ్ గౌడ్ ప్రస్తుతం టిటిడి సభ్యుడిగా ఉన్నారు.
గీతారెడ్డి కారు ఎక్కుతారని ప్రచారం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతా రెడ్డి కూడా టిఆర్ఎస్లో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ వార్తలను ఆమె ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన పైన వచ్చినవి అవాస్తవాలు అన్నారు.
కాగా, ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టిఆర్ఎస్ ఇప్పటికే టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత ప్రస్తుత మంత్రి, టిడిపి నుంచి గెలిపొందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కారు ఎక్కారు.