మంత్రి మల్లారెడ్డికి షాక్: 50బృందాలతో మంత్రి ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలంలో ఐటీ దాడులు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఒకేసారి 50 బృందాలతో మంత్రి మల్లారెడ్డి నివాసాలపై దాడులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ అధికారులు నేడు తెల్లవారుజాము నుంచి దాడులు చేస్తున్నారు. కొంపల్లి లోని మల్లా రెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
సికింద్రాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ఆయన ఇల్లు, ఇతర కార్యాలయాలలో తనిఖీలు ప్రారంభించారు ఇన్కమ్ టాక్స్ అధికారులు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు నజర్ పెట్టారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి తో పాటు ఆయన అల్లుడు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.

మొత్తం యాభై బృందాలు ఏకకాలంలో రంగంలోకి దిగి మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నాయి. ఇక మరోవైపు మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుడు నివాసాలతో పాటుగా, మల్లారెడ్డి సోదరుల నివాసాలలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లలో ఐటి అధికారుల దాడులు కొనసాగాయి. మళ్లీ ప్రస్తుతం మరో మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో ఐటి అధికారులు దాడులు జరగడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications