షాకింగ్ .. డ్రగ్స్ దందాలో ఏపీ డీఎస్పీ పేరు
తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఈ ముఠాలో ఒకరు అనంతాద్రి దేవాలయ అర్చకులు కాగా పోలీసులు ఈ ముఠాలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపైన విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక డీఎస్పీ స్థాయి అధికారి ప్రత్యక్షంగా డ్రగ్స్ సరఫరా చేశారనే సంచలన విషయాన్ని బయటపెట్టారు ముఠా సభ్యులు. ఇది తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది.
ఏపీ పోలీస్ అధికారి సహకారంతోనే దందా
కోటి రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు వారి వద్ద నుండి కొకైన్ మరియు హెరాయిన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ముఠాలో ఐదుగురు సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరికొందరు కోసం వేట ప్రారంభించారు. నిందితులను రాచకొండ ఎస్ఓటి , సరూర్నగర్ పోలీసులు విచారించగా ఏపీ లోని ఒక పోలీస్ అధికారి ద్వారానే తాము ఈ దందాలోకి దిగామని వారు చెప్పారు .
కోటి విలువ చేసే డ్రగ్స్ అమ్మే ప్రయత్నం
ఏపీలోని నెల్లూరు జిల్లా రంగనాయకులపేటకు చెందిన అబేద్, అతని స్నేహితుడు అమ్జద్తో తో కలిసి ఒక పోలీసు ఆఫీసర్ నుంచి కేజీన్నర కొకైన్, హెరాయిన్, వాటిలో కలిపే రసాయన పదార్థాన్ని తెచ్చి అమ్మే ప్రయత్నం చేశారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓంకార్ కు , కృష్ణపట్నం పోర్టు ప్రాంతానికి చెందిన రాజశేఖర్కు డ్రగ్స్ విక్రయిస్తే భారీగా కమీషన్ ఇస్తానని, వీటి ధర గ్రాము పదివేలు ఉంటుందని చెప్పాడు.డ్రగ్స్ పరిశీలించిన ఓంకార్, రాజశేఖర్ వైజాగ్లో ఉన్న స్నేహితుడు కనకరాజును సంప్రదించారు.కనకరాజు వరంగల్కు చెందిన పుజారి చక్రధరాచార్యులుకు సమాచారమిచ్చారు.
డ్రగ్స్ ముఠాలో దేవాలయ అర్చకుడు ... తెలంగాణలో సంచలనం
హైదరాబాద్లో పట్టుబడిన గ్యాంగ్ ... విచారణలో ఏపీ పోలీస్ డీఎస్పీ పేరు
వీరంతా కలిసి వైజాగ్, హైదరాబాద్లో డ్రగ్స్ కొనేవారి కోసం వెతికారు. దీంతో ఈ నెల 9న నెల్లూరులో అబేద్ నుంచి కనకరాజు, ఓంకార్, రాజశేఖర్ డ్రగ్స్ను తీసుకొని హైదరాబాద్కు వచ్చి కర్మాన్ఘాట్లో పోలీసులకు పట్టుడ్డారు. రాజశేఖర్, ఓంకార్ పారిపోగా కనకరాజు పోలీసులకు చిక్కాడు. విచారణలో ఏపీ పోలీసు అధికారి పేరు బయటికి వచ్చింది. ఏపీ పోలీసుశాఖలో ఈ ముఠాకు డ్రగ్స్ విక్రయించిన డి.ఎస్.పి స్థాయి అధికారి పేరు ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు. నిందితులు చెప్పిన విషయాలను ధ్రువీకరించుకునే పనిలో పడ్డారు.