షాకింగ్ ... కేసీఆర్ క్యాబినెట్ విస్తరణలో మహిళలకు మొండి చెయ్యి ?
తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో అందరి చూపు మహిళలకు మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపైనే ఉంది. గత కేబినెట్లో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా మహిళలకు స్థానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్ . అయితే రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు స్థానం లేనట్లుగానే తెలుస్తోంది.
ఈ దఫా విస్తరణలో మహిళలకు మొండి చెయ్యి
19న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి, అటు ప్రజల దృష్టి మహిళా మంత్రి గా ఎవరికి అవకాశం ఇస్తారు అన్నదానిపైనే ఉంది. అయితే మహిళా మంత్రిగా అవకాశం కోసం రేసులో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత లు ఉన్నారు. ఈ నెల 19న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో వీరిలో పద్మా దేవేందర్ రెడ్డి కి మంత్రిగా అవకాశం ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నట్లుగా ప్రచారము జరిగింది.అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎనిమిది మందికి అవకాశం ఇవ్వనున్నట్టు అందులో కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎనిమిది మందిలో మహిళా మంత్రి లేనట్లుగా ప్రచారమవుతోంది.
లోక్ సభ ఎన్నికల తర్వాత మరో దఫా విస్తరణ ... మహిళలకు స్థానం దక్కేనా
ప్రస్తుతం ఎనిమిది మందితో క్యాబినెట్ విస్తరణ చేస్తున్నకేసిఆర్ లోక్ సభ ఎన్నికల తర్వాత మరోమారు మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో అయినా మహిళలకు మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. 19న జరగనున్న మంత్రివర్గ విస్తరణ లోని మహిళలకు అవకాశం ఇస్తారని భావించిన అందరూ ఈ సారి కూడా మహిళకు స్థానం లేదని తెలియడంతో కాస్త షాక్ కు గురయ్యారు. తోలి మహిళా మంత్రి ఎవరు అని ఆసక్తిగా చూసిన వారు మహిళలకు ఛాన్స్ లేదు అని తెలియటంతో పెదవి విరుస్తున్నారు.తమకు అవకాశం వస్తుందని భావించిన మహిళా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ మొండి చెయ్యి చూపించటంతో హతాశులయ్యారు.మహిళల విషయంలో అసలు సీఎం కేసీఆర్ దృష్టి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ దఫా జరగనున్న విస్తరణలో మహిళ లేనట్టే అని టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. గిరిజన, మహిళా మంత్రులపై ఇంకా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల తర్వాత మరోదఫా జరగనున్న మంత్రివర్గ విస్తరణలో వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా పార్టీ అంతర్గత వర్గాలు చెప్తున్నాయి.
కేబినెట్ విస్తరణలో కొత్తనీరు... అందులో మహిళలు లేరు
19న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కూడా కొత్త నీరు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ మంత్రులకు ఈ మంత్రివర్గ విస్తరణ షాక్ ఇవ్వనున్నట్లు గా తెలుస్తోంది. గత క్యాబినెట్ లో పనిచేసిన ముగ్గురు మంత్రులకు అదృష్టం వరించనున్నట్లు గా సమాచారం . ఇక నేడు కాబోయే మంత్రులకు కెసిఆర్ స్వయంగా ఫోన్ చేసి తీపి కబురు అందించబోతున్నట్లుగా సమాచారం. ఇంతకాలం మంత్రి పదవి కోసం నానా పాట్లు పడి ఎదురు చూసిన ఆశావహుల్లో ఎవరికి సీఎం కేసీఆర్ తీపి కబురు అందించబోతున్నారో అన్నది ఆసక్తిగా మారింది. అయితే మహిళలకు మాత్రం ఈసారి విస్తరణలో చాన్స్ లేనట్టే అని తెలియడంతో మంత్రి రేసులో ఉన్న మహిళలకు ఇది చేదు వార్తే.