రైతులు ప్రమాణాలు చేయాలా?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుబంధు ఎగ్గొట్టేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ మాజీ సీఎం కేటీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీలో రూ. 22 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పత్తి, కంది, చెరుకు రెండో పంట ఉండదని, అయినా రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,500 కోట్లు ఎగ్గొట్టిందన్నారు. రైతుబంధు పేరిట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

రైతును రాజును చేస్తామని ఎన్నికల ముందు చెప్పారని, రైతు డిక్లరేషన్ పేరుతో చాలా హామీలు ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. ప్రజా పాలనలో 1.6 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే.. యాచించాలని కాంగ్రెస్ అంటోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వానా కాలంలో ఎగ్గొట్టిన రైతుబంధును కూడా ఇవ్వాల్సిందేనని అన్నారు.
రైతులందరికీ రైతుభరోసా ఇవ్వకపోతే రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 11 సార్లు రైతుబంధు వేశాక మళ్లీ ఇప్పుడు దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించారు. గ్రామాల వారీగా రుణమాఫీ జాబితాలు పెట్టాలని, రైతుభరోసా ఎవరికి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలన్నారు.
రైతుల నుంచి ప్రమాణపత్రాలు, దరఖాస్తులు అనే పనికిమాలిన మాటలు ఆపేయాలన్నారు కేటీఆర్. శనివారం (డిసెంబర్ 4) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామన్నారు. రైతుబంధు కేసీఆర్ మానసపుత్రిక అని.. ఈ పథకాన్ని బొందపెడితామంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతుబంధు ఇప్పిస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications