అంతా కుట్రే: శిరీషను అలా ఉపయోగించుకోవాలనే!, కస్టడీలో శ్రవణ్ కీలక విషయాలు
ఆ తర్వాత సిగరెట్ తాగాలనే ఉద్దేశంతో రాజీవ్, శ్రవణ్, ప్రభాకర్ రెడ్డిలు ముగ్గురూ తొలుత బయటకొచ్చారు. ఆపై శ్రవణ్ రెండోసారి సంకేతం ఇవ్వగానే.. ప్రభాకర్ రెడ్డి వీరిద్దరిని బయటే ఉంచి, తాను లోపలికెళ్లాడు.
హైదరాబాద్: చిక్కుముడి వీడని ఎన్నో అనుమానాలతో శిరీష మృతి కేసు ఇంకా మిస్టరీనే తలపిస్తోంది. ఆత్మహత్య అని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఏ మూలనో ఎక్కడో తేడా కొడుతుందే? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిందితులను కాపాడాల్సిన అవసరం పోలీసులకు లేకపోయినా.. విచారణ నిష్పక్షపాతంగా జరిగిందా? అన్న దానిపై అటు శిరీష కుటుంబ సభ్యులకు, ఇటు మీడియాకు ఇంకా సందేహాలు తొలగిపోలేదు.
శిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా?: పోలీసులు ఎందుకలా చేశారు.. మభ్యపెట్టడానికేనా?
పోలీసుల కస్టడీలో మాత్రం ఇదంతా ఓ పథకం ప్రకారం పన్నిన కుట్రేనని స్పష్టమైనట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల కస్టడీలో భాగంగా.. కేసులో ఏ-1నిందితుడిగా ఉన్న శ్రవణ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. శిరీష పట్ల ఎలా దురుద్దేశంగా వ్యవహరించింది?.. ఆమెను లొంగదీసుకోవడానికి ఎలా ప్లాన్ చేసింది? శ్రవణ్ పూసగుచ్చినట్లు చెప్పాడని తెలుస్తోంది.
శిరీషను ఉపయోగించుకోవాలని:
తొలి నుంచి శిరీష పట్ల దురుద్దేశంతోనే ఉన్న శ్రవణ్.. రాజీవ్ తో ఆమెకున్న గొడవలను ఇందుకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారం పేరిట సీన్ లోకి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని దింపి.. శిరీషపై ఆయనకు మోజు కలిగేలా చేశాడు.
అంతకుముందు కూడా శ్రవణ్.. ప్రభార్ రెడ్డికి అమ్మాయిలను సరఫరా చేసిన నేపథ్యంలో.. శిరీషను కూడా అదే తరహాలో తనవద్దకు తీసుకొస్తున్నాడని ఎస్ఐ భావించాడు. అంతేకాదు, శిరీషను బాగా ఉపయోగించుకోవాలని కూడా శ్రవణ్ అతనితో చెప్పడం.. ఆమె పట్ల ప్రభాకర్ రెడ్డికి మరింత ఆకర్షణ పెంచింది. కానీ తీరా కుకునూర్ పల్లిలో సీన్ బెడిసికొట్టడంతో.. వ్యవహారం ఇక్కడిదాకా వచ్చింది.
శిరీషకు ఎక్కువ మద్యం:
ముందుగా అనుకున్న ప్రకారమే.. శిరీష, రాజీవ్, శ్రవణ్ ముగ్గురూ కలిసి కుకునూర్ పల్లి చేరుకునే సరికి ఎస్ ప్రభాకర్ రెడ్డి మాంసాహారం, మందు రెడీ చేశారు. పార్టీ సమయంలో.. శిరీషకు కావాలనే మద్యం ఎక్కువగా పోశారు. ఆవిధంగానైనా ఆమె లొంగుతుందనేది వీరి ప్లాన్ లో భాగం.
ఆ తర్వాత సిగరెట్ తాగాలనే ఉద్దేశంతో రాజీవ్, శ్రవణ్, ప్రభాకర్ రెడ్డిలు ముగ్గురూ తొలుత బయటకొచ్చారు. ఆపై శ్రవణ్ రెండోసారి సంకేతం ఇవ్వగానే.. ప్రభాకర్ రెడ్డి వీరిద్దరిని బయటే ఉంచి, తాను లోపలికెళ్లాడు.
శిరీషను లొంగదీసుకోవాలని:
గదిలోకి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి శిరీషను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ శిరీష మాత్రం తానలాంటి దానిని కాదని గట్టిగా ప్రతిఘటించింది. ఏడుపులు, కేకలు పెట్టడంతో.. శ్రవణ్, రాజీవ్ లు తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. శిరీషను వారించే క్రమంలో రాజీవ్ ఆమెపై చేయి చేసుకున్నాడు.
ఎస్ఐ ప్రభాకర్రెడ్డి ఇంట్లో రచ్చ కాకూడదనే శిరీషను రాజీవ్ తీవ్రంగా కొట్టాడని, తాము ముగ్గురం ఎస్సై వద్దకు వస్తున్నట్టు కాపలాదారు, హోంగార్డులకు కూడా తెలుసని శ్రవణ్ ఒప్పుకొన్నట్టు సమాచారం.
వదిలించుకోవాలనుకున్న రాజీవ్:
తేజస్వినికి తనకు మధ్య శిరీష అడ్డుగా ఉండటంతో.. ఆమెను ఎలాగైనా తొలగించుకోవాలని రాజీవ్ తనతో చెప్పాడని శ్రవణ్ వెల్లడించాడు. దీంతో తన మనసులో దురుద్దేశం మొదలైందని పోలీసులు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని ఎలాగైనా అందింపుచ్చుకుని శిరీషను వాడుకోవాలని పలుమార్లు ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ సూచించినట్లు చబుతున్నారు.
దాటవేసిన శ్రవణ్:
కస్టడీలో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలను శ్రవణ్ దాటవేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కేసులో నిన్న మొన్నటిదాకా బయటకురాని తేజస్విని మంగళవారం పలు అభిప్రాయాలను వెలిబుచ్చింది. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు ఫోన్ చేయగా.. తాను రాయదుర్గంలో ఉన్నానని చెప్పడంతో ఇద్దరు పోలీసులు వెళ్లి ఆమెతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
శిరీషతో గతంలో తనకెలాంటి పరిచయం లేదని, ఆర్జే స్టూడియోలోనే తొలిసారిగా ఆమెను చూశానంటూ తేజస్విని పోలీసులతో చెప్పింది. తాను, రాజీవ్ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో.. ఓరోజు రాజీవ్, శిరీషలు భార్యభర్తలంటూ అక్కడి పనివారు చెప్పారని, దీనిపై తేల్చుకునేందకే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లామని తేజస్విని చెప్పుకొచ్చింది.
శిరీషపై నిజంగా తనకు ద్వేషమే ఉంటే.. తన ఫిర్యాదు వెనక్కి తీసుకునేదాన్ని కాదని తేజస్విని చెప్పడం గమనార్హం. ఇక శిరీష ఆడియో టేపుల్లో తెర పైకి వచ్చిన నందు, నవీన్ లు ఎవరనే దానిపై ఆరా తీయగా.. వాళ్లెవరో తనకు తెలియదని శిరీష స్నేహితులు లేదా బంధువులు అయి ఉండవచ్చునని తేజస్విని పేర్కొంది.