బండి సంజయ్పై దాడి జరగలేదు... ఆ డబ్బులు పోలీసులు పెట్టలేదు... సిద్దిపేట సీపీ రియాక్షన్...
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై దాడి ఆరోపణలు,బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు బంధువు ఇంట్లో పోలీసులే డబ్బులు పెట్టారన్న ఆరోపణలపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ స్పందించారు. బండి సంజయ్పై దాడి ఆరోపణలను సీపీ ఖండించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో... ఆయనకు తానే స్వయంగా ఫోన్ చేసి పరిస్థితి గురించి వివరించినట్లు చెప్పారు. దాంతో సిద్దిపేటకు రానని ఎంపీ తనతో చెప్పారన్నారు. అయినప్పటికీ అనూహ్యంగా ఎంపీ సిద్దిపేట బయలుదేరారని... దీంతో పట్టణ శివారులోనే ఆయన్ను అడ్డుకోవాల్సి వచ్చిందని అన్నారు.
బండి సంజయ్కి అమిత్ షా ఫోన్: పవన్ కళ్యాన్ స్పందన, రఘునందన్ ఇంటికి కిషన్ రెడ్డి
ఎంపీ సంజయ్కి ఫోన్ చేసి చెప్పాను : సీపీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సిద్దిపేట వెళ్లడం సరికాదని... శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉంటుందని ఎంపీ సంజయ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశామన్నారు సీపీ జోయల్ డేవిస్. అక్కడినుంచి వెళ్లేందుకు మొదట ఆయన నిరాకరించారని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ గౌరవప్రదంగా కరీంనగర్ పంపించామని తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగినట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారని... అందులో నిజం లేదని అన్నారు.
దాడి జరగలేదు... గౌరవంగా పంపించాం...
పోలీసులే రఘు నందన్ రావు బంధువు ఇంట్లో డబ్బులు పెట్టారన్న ఆరోపణలను సీపీ ఖండించారు. ముందస్తు సమాచారంతో.. ఎగ్జిక్యూటివ్ అధికారి అనుమతి తీసుకున్నాకే సోదాలు నిర్వహించామని చెప్పారు. రఘునందన్ రావు బంధువు సురభి అంజన్ కుమార్ ఇంట్లోనే డబ్బును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ సమయంలో వారితో సంతకాలు కూడా తీసుకున్నామన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో వారిని అడ్డుకోలేకపోయామని అన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది పోలీస్ అధికారి వద్ద ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పారు. అందులో 20 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. సోదాల సందర్భంగా ఇంట్లో వాళ్లతో తమ దురుసుగా ప్రవర్తించామన్న ఆరోపణలను ఖండించారు. సోదాల వీడియోలను రిలీజ్ చేశామని... వాటిని గమనిస్తే అసలు నిజాలు అందరికీ తెలుస్తాయన్నారు.
Recommended Video
విరుచుకుపడ్డ ఎంపీ అరవింద్..
అంతకుముందు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ఎంపీ పట్ల అంత దురుసుగా ప్రవర్తించడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రోజు వారి కూలీ తీసుకునే గూండా లాగా సీపీ వ్యవహరించాడని ఆరోపించారు. ఒక ఎంపీ పట్ల దురుసుగా ప్రవర్తించి ఎన్నిరోజులు ఉద్యోగం చేసుకోగలుగుతావని హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని విధులు నిర్వహించాలని హెచ్చరించారు. దుబ్బాక ఎన్నికల్లో కేంద్ర బలగాలను దించాలని... జోయల్ డేవిస్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు.