ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!
సింగరేణి కాలరీస్ నష్ట నివారణా చర్యలపై దృష్టి సారిస్తోంది. సింగరేణి కాలరీస్ కు సంబంధించి భూగర్భ గనులలో భారీగా నష్టాలు నమోదు అవుతున్న క్రమంలో కేంద్రం సూచనలను పరిశీలిస్తోంది. భారీ నష్టాలను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది.
నష్టాలను తగ్గించుకునే ఆలోచనలో సింగరేణి
కేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు గని అభివృద్ధి, నిర్వహణ ఎండీవో విధానంలో ఈ బదిలీ జరుగుతుంది. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ వంటి జాతీయ సంస్థలు ఇదే విధానం ద్వారా నష్టాలను తగ్గించుకున్న నేపథ్యంలో సింగరేణి కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

శాంతిఖని భూగర్భ గని త్వరలో ప్రైవేటీకరణ
మందమర్రి ప్రాంతంలోని శాంతిఖని భూగర్భ గనిని ప్రయోగాత్మకంగా అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఒక ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థ సొంత ఖర్చుతో బొగ్గు తవ్వి నిర్ణీత ధరకు సింగరేణికి అందిస్తుంది. సింగరేణి ఆ బొగ్గును మార్కెట్లో విక్రయిస్తుంది.
రూ.1,924 కోట్లు నష్టాల్లో భూగర్భ గనులు
ప్రస్తుతం శాంతిఖనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి సుమారు రూ.21,558 ఖర్చవుతుండగా విక్రయ ధర కేవలం రూ.4,167 మాత్రమే. ఆడ్రియాల గనిలో టన్నుకు ఉత్పత్తి వ్యయం రూ.30,333 కాగా విక్రయ ధర రూ.2,492 మాత్రమే. ఒక్క గనిలోనే గతేడాది రూ.302 కోట్లకు పైగా నష్టం వచ్చింది. 2025 చివరి నాటికి 22 భూగర్భ గనుల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. వాటి మొత్తం నష్టం రూ.1,924 కోట్లు దాటింది.
సింగరేణి పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కుకునే ప్రమాదం
ఇంత నష్టాలలో ఉన్న సింగరేణి గట్టెక్కాలి అంటే ప్రైవేటీకరణ మార్గం అని కేంద్ర బొగ్గు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో ఎండీవో విధానంలో ప్రైవేట్ కు అప్పగించాలని సూచన చేసింది. లేదంటే సింగరేణి పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని కేంద్ర బొగ్గుశాఖ హెచ్చరిస్తోంది.
నష్టాలను తగ్గించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని సంస్థ లక్ష్యం
సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఉపరితల గనులను నిర్వహిస్తోంది. ఉపరితల గనుల లాభాలతోనే భూగర్భ నష్టాలను పూడ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఎండీవో విధానం ద్వారా నష్టాలను తగ్గించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ ప్రైవేటీకరణలో సాధ్యాసాధ్యాలను సింగరేణి పరిశీలిస్తుంది.














Click it and Unblock the Notifications