ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాటం చేసిన సిరివెన్నెల .. మరణానికి కారణాలు చెప్పిన కిమ్స్ వైద్యులు
ఆది భిక్షువు వాడినేది కోరేది.... బూడిదిచ్చేవాడినేది అడిగేది అంటూ వైరాగ్యం గురించి చెప్పినా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ జీవిత సత్యాన్ని బోధించినా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని అంటూ సామాజిక పోకడలను వేలెత్తి చూపినా అది సిరివెన్నెల సీతారామ శాస్త్రికే సాధ్యం. తెలుగు సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఎన్నో అర్థవంతమైన పాటలను, స్ఫూర్తిదాయకమైన పాటలను, సందర్భోచితమైన అద్భుతమైన పాటలను రాసి సినీగేయ రచయితగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధ్రువ తార
తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ఓ ధృవతార సిరివెన్నెల సీతారామశాస్త్రి, పాటల పూదోటలో వెన్నెలలు కురిపించి ఒక్కసారిగా తెలుగు సినీ ప్రపంచాన్ని అంధకారంలో వదిలి వెళ్ళిపోయారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్త యావత్ సినీ లోకాన్ని తీరని ఆవేదనకు గురిచేస్తుంది. ఆయన పాటల ఔన్నత్యం, ఆయన పాటల్లోని సాహిత్య విలువలను గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా పాటకు సాహిత్యం గౌరవాన్ని కలిగించిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.

ఆరేళ్ళ క్రితం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాటం చేసిన సిరివెన్నెల
ఇదిలా ఉంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నిమోనియా తో సీతారామశాస్త్రి మరణించారని చాలామంది భావిస్తుంటే, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల కేన్సర్ తో ఇబ్బంది పడ్డారని, ఆయనకు చికిత్స అందించిన కిమ్స్ ఎండి డాక్టర్ భాస్కర్ రావు సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానికి గల కారణాలను వివరించారు. ఆరేళ్ల క్రితం క్యాన్సర్ సగం ఊపిరితిత్తు తీసివేయాల్సి వచ్చిందని ఆ తర్వాత సిరివెన్నల సీతారామ శాస్త్రి కి బైపాస్ సర్జరీ కూడా జరిగిందని డాక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు .

వారం రోజుల క్రితం క్యాన్సర్ వచ్చిన మరో ఊపిరితిత్తులో కొంత భాగం తొలగింపు
ఇక వారం రోజుల క్రితం మరోవైపు ఊపిరితిత్తుకు కూడా క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారని ఆ తరువాత రెండు రోజులు ఆయన బాగానే ఉన్నారని, ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్సుడ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్ కు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కిమ్స్ లో రెండు రోజులు వైద్యం అందిస్తే బాగానే రికవర్ అయ్యారని పేర్కొన్న డాక్టర్ భాస్కర్ రావు ప్రికాస్టమీ కూడా చేశామని వెల్లడించారు. 45 శాతం ఊపిరితిత్తులను క్యాన్సర్ కారణంగా తీసేశాము కాబట్టి మిగిలిన 55 శాతం మాత్రమే ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయని, ఆ లంగ్స్ కి ఇన్ఫెక్షన్ రావడంతో ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్ పెట్టామని తెలిపారు.
Recommended Video

ఐదు రోజుల నుండి ఎక్మో మిషన్ పై సిరివెన్నెల.. అనేక అనారోగ్య కారణాలతో కిడ్నీ ఫెయిల్, ఇన్ఫెక్షన్ తో మృతి
గత ఐదు రోజుల నుండి ఎక్మో మిషన్ పైనే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నారని పేర్కొన్న వైద్యుడు క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడంవల్ల ఆయన కిడ్నీ డ్యామేజ్ అయిందని ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకిందని దీంతో ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాలకు తుది శ్వాస విడిచారని వెల్లడించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాటం చేశారని కిమ్స్ వైద్యుడు భాస్కర్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications