కొలిమిలా కొత్తగూడెం: వేడెక్కుతున్న తెలంగాణ, ఆందోళనలో ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా మంగళవారం నిప్పుల కొలిమిని తలపించింది.
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా మంగళవారం నిప్పుల కొలిమిని తలపించింది. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ప్రస్తుత సీజన్లోనే అత్యధికంగా జిల్లాలోని భద్రాచలంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. పాల్వంచ మండలం యానాంబైలు గ్రామంలో 44.1 డిగ్రీలు, దుమ్ముగూడెంలో 44 డిగ్రీలు, భద్రాచలం రూరల్లో 43.9 డిగ్రీలు, ఖమ్మం జిల్లా వైరాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక మహబూబ్నగర్లో 42.6, ఖమ్మంలో 42.2, నల్లగొండ, నిజామాబాద్లో 41 డిగ్రీలు, జనగామలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఏప్రిల్ 11 నాటికి ఏనాడూ 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరలేదని తెలిపారు. ఏప్రిల్ మూడో వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే రికార్డు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2010 ఏప్రిల్ 23న హన్మకొండలో 44.3, గతేడాది ఏప్రిల్ 22న మెదక్లో 44.2 డిగ్రీలు, 26న మహబూబ్నగర్లో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి.
గతేడాది ఏప్రిల్ 22వ తేదీన రామగుండంలో 46.1 డిగ్రీలు, 2015లో ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇంతకన్నా ముందుగా ఎక్కడా 44 డిగ్రీలు నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 10 గంటలకే ఎండ సుర్రుమని తాకుతుండగా, మధ్యాహ్నం వడగాలులు వీస్తున్నాయి. దీంతో జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
వచ్చే నెల ఎండ ప్రచండమే
వచ్చే నెల వడగాడ్పుల తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మే నెలలో గరిష్టంగా 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతాయని, దీంతో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని తెలిపింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా అంటే వడగాడ్పులుగా లెక్కిస్తారని, ఆరు డిగ్రీల కన్నా అధికంగా ఉంటే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారని చెప్పింది. వడగాడ్పులు ఉన్నప్పుడు వేసవి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించింది.
విపత్తు నిర్వహణ శాఖ సూచనలు
ఆరుబయట పని చేసే ఉపాధి కూలీ పనులు ఉదయం వేళల్లోనే పూర్తి చేయాలి. వడగాడ్పుల సమయంలో ప్రయాణాలను మానుకోవాలి. బస్సు వేళల్లోనూ మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులు నడపకూడదని వేసవి ప్రణాళికలో విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లోనూ వేసవి ప్రణాళికలు అమలు చేస్తున్నారని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు.
వారాంతంలో వేడెక్కనున్న హస్తిన
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాతావరణంలో స్వల్ప తేడాలు ఉన్నాయి. ఉదయం, సాయంకాలం వేళల్లో వాతావరణం బాగానే ఉంటున్నా మధ్యాహ్నం మాత్రం వేడి ఠారెత్తిస్తున్నది. సఫ్దర్ జంగ్ లో సాధారణ స్థాయి కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత, పాలెం విమానాశ్రయం వద్ద ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న చల్లని గాలుల వల్ల సాధారణ పరిస్థితిలో మార్పు కానవస్తున్నది. కానీ ఈ వారాంతంలోగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని ప్రైవేట్ వాతావరణ అధ్యయనం సంస్థ స్కైమెట్ తెలిపింది. ఇక రాజస్థాన్లోనూ సాధారణ స్థాయిని మించిన ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నాయి.