ఉప్పల్లో చెట్టుకు ఉరివేసుకొని సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఉప్పల్లో గురువారం విషాదం చోటు చేసుకుంది. మెట్రో సమీపంలోని హెచ్ఎండీఏ లే అవుట్లో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యతీష్ అనే టెక్కీ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బండ్లగూడ నివాసి అయిన యతీష్ ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. యతీష్ మరణ వార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు, యతీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాలిక అదృశ్యం
ఇంటి నుంచి స్కూలుకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన అల్వాల్లో చోటు చేసుకుంది. స్థానిక సెయింట్ జేవీఆర్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోన్న సంగీత మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలతో పాటు స్నేహితుల ఇళ్లకు వెళ్లి గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పాఠశాల లోపలకు, బయటకు వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి. వాటి ఆధారంగా పాఠశాలలో బాలిక 20 నిమిషాలు ఉన్నట్లు గుర్తించారు.
భార్యను చంపిన భర్త
గుంటూరు జిల్లా చేబ్రోలులో దారుణం జరిగింది. మద్యం మత్తులో కోటేశ్వర రావు అనే వ్యక్తి రోకలి బండతో భార్యను కొట్టి హత్య చేశాడు. వీరిద్దరికీ రెండో వివాహమే కావడంతో కొంతకాలంగా కలహాలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గురువారం వేకువజామున తలెత్తిన వివాదం పెద్దగా అయింది. ఇది హత్యకు దారి తీసిందని భావిస్తున్నారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.