అమ్మ లేకుండా బ్రతకలేనని.. తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలోనే తనయుడు ఆత్మహత్య.. విషాద ఘటన
అమ్మ లేకుండా ఉండలేకపోయిన ఓ తనయుడు తల్లి మరణించిన రోజే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన స్మశాన వాటిక లోనే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. సంక్రాంతి పండుగ సమయంలో అత్యంత విషాదకరమైన ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తల్లి కోసం ప్రాణాలు తీసుకున్న తనయుడి కథ
నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మరిచిపోతున్న కొడుకులు ఉన్న నేటి రోజుల్లో, బ్రతికున్న తల్లిదండ్రులను అనాధలుగా మార్చి అనాథ ఆశ్రమాలలో చేరుస్తున్న కొడుకులున్న నేటి రోజులలో, తల్లి చనిపోతే, తల్లి లేకుండా తాను జీవించలేను అని ఆ తల్లి కోసం తాను కూడా ప్రాణాలు తీసుకున్న తనయుడి కథ అందరిని కంట తడి పెట్టిస్తుంది. తల్లి మీద కొడుకుకు ఉన్న ప్రేమకు అద్దం పడుతుంది.
తండ్రి లేని కొడుకులను ఎంతో కష్టపడి పెంచిన తల్లిపై కొడుకు ప్రేమ
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గోల్నాక శ్యామ్ నగర్ లో నివాసం ఉంటే నాగేందర్, లక్ష్మీ బాయి దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లల చిన్నతనంలోనే తండ్రి నాగేందర్ తనువు చాలించాడు. లక్ష్మీబాయి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసింది. కూలీనాలీ పనులను చేసి పిల్లలను పోషించింది. లక్ష్మీబాయి కుమారులైన వినోద్ కుమార్, విజయ్ కుమార్ ల లో విజయ్ కుమార్ కు పెళ్లయింది. కాగా వినోద్ కుమార్ కు ఇంకా పెళ్లి కాలేదు. ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా, తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు వినోద్ కుమార్.
క్యాన్సర్ వ్యాధితో మరణించిన తల్లి.. తల్లి లేకుండా బ్రతకలేనన్న తనయుడు సూసైడ్
అయితే గత కొంత కాలంగా లక్ష్మీబాయి అనారోగ్యానికి గురైంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ బాయి బుధవారం నాడు ప్రాణాలు కోల్పోయింది. తాను ప్రాణంగా భావించే తల్లి చనిపోవడంతో తట్టుకోలేకపోయాడు వినోద్ కుమార్. బుధవారం నాడు గోల్నాక హర్రాస్ పెంట స్మశానవాటికలో లక్ష్మీబాయికి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఇంటికి వచ్చిన వినోద్ కుమార్ అప్పటికీ తల్లి లేని బాధను భరించలేక పోతున్నాడు.
తల్లికి అంత్య క్రియలు చేసిన స్మశానంలోనే కొడుకు ఆత్మహత్య
తల్లి చనిపోవడంతో తనకు ఎవరూ దిక్కులేరని భావించి ఆవేదనకు గురైన వినోద్ కుమార్ అమ్మ లేకుండా తన ఎట్లా బ్రతకాలని, తాను కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుని ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు. తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన స్మశాన వాటిక షెడ్ వద్దకు వెళ్లి తన తల్లి కోసం దీనంగా రోదించాడు. ఆపై అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన స్మశాన వాటిక వద్దే కొడుకు వినోద్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం బంధువులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.
తల్లీకొడుకుల ప్రేమపై స్థానికంగా చర్చ
మొదటి నుంచి వినోద్ కుమార్ తల్లికి ఎంతో సన్నిహితంగా ఉండేవాడని, తల్లి మీద విపరీతమైన ప్రేమను కనబరిచేవాడు అని, అందుకే తల్లి లేకుండా ఉండలేక పోయాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. బ్రతికున్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించని కొడుకులు ఉన్న నేటి రోజుల్లో, అనారోగ్య కారణాలతో మరణించిన తల్లి కోసం తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు అంటే ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా స్థానికంగా చోటు చేసుకున్న ఈ ఘటన గోల్నాక శ్యామ్ నగర్ వాసులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.