దారుణం: లక్ష రూపాయల కోసం తల్లినే పొట్టన పెట్టుకున్నాడు
హైదరాబాద్: తన తల్లిని ఓ వ్యక్తి పొట్టన పెట్టుకున్నాడు. మద్యానికి బానిసై డబ్బు కోసం కన్నతల్లినే గొంతు పిసికి హత్య చేశాడు. సోమవారం హైదరాబాదులోని మీర్పేట్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రంగస్వామి వివరాలు వెల్లడించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన యానాదమ్మ (80) మూడేళ్ల క్రితం చిన్న కొడుకు కొండయ్యతో కలిసి హైదరాబాద్ వచ్చి, మీర్పేట్లోని గుర్రంగూడ ఆదిత్యనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ నెల 13వ తేదీన అనుమానాస్పదస్థితిలో యానాదమ్మ (80) మృతి చెందింది.

ఆమె కూతురు కొండమ్మ ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో యానాదమ్మ కొడుకు కొండయ్య తాగుడుకు బానిస అయ్యాడని, తరుచూ డబ్బు కోసం తల్లి వేధించేవాడని దర్యాప్తులో తెలిసింది. దీంతో కొండయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.
తల్లిని చంపింది తానేనని పోలీసు విచారణలో అతను అంగీకరించాడు. యానాదమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక్క కూతురు ఉన్నారు. గ్రామంలోని ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బు ముగ్గురు కొడులు సమానంగా తీసుకొని, తల్లికి లక్ష రూపాయలు ఇచ్చారు. ఇటీవల తాగుడుకు బానిసైన కొండయ్య ఆ లక్ష రూపాయల కోసం నిత్యం తల్లిని వేధించేవాడు. ఈ నెల 13వ తేదీన ఉదయం డబ్బు విషయమై తల్లీకొడుకులు గొడవపడ్డారు.
డబ్బులు లేవని తల్లి చెప్పడంతో ఆమెను బలంగా తోసేశాడు. దీంతో ఆమె తల గోడకు తగిలి కిందపడిపోయింది. ఆమె తేరుకునేలోపే నోట్లో గుడ్డలు కుక్కి గొంతు పిసికి హత్య చేసిన్నట్లు పోలీసులు చెప్పారు. ఏమీ ఎరుగనట్ల ప్రమాదవశాత్తు తల్లి చనిపోయిందని అన్నలు, చెల్లెలికి ఫోన్ చేశాడని తెలిపారు. నేరాన్ని అంగీకరించడంతో కొండయ్యను రిమాండుకు తరలిస్తున్నట్లు సీఐ రంగస్వామి తెలిపారు.












Click it and Unblock the Notifications