కొడుకుల దారుణం: ఉరేసి తండ్రిని చంపేశారు
ఆదిలాబాద్: తండ్రి మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండడంతో విసిగిపోయిన కొడుకులు ఏకంగా ఉరివేసి హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కాసిపేట మండలంలోని పెద్దనపల్లికి చెందిన చెండె భీమయ్య(74) నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేవాడు.
మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చిన భీమయ్యకు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. తండ్రి గొడవలతో విసిగిపోయిన ఇద్దరు కొడుకులు మల్లయ్య, చిన్నయ్యలు తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

అర్ధరాత్రి వేళ భీమయ్య నిద్రిస్తుండగా మంచం నవారునే తీసి మెడకు చుట్టి పైన దూలానికి ఉరివేయగా ఊపిరాడక మృతిచెందాడు. బుధవారం ఉదయం తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న కాసిపేట ఎస్ఐ జక్కుల శ్యాంసుందర్ సిబ్బందితో వచ్చి తమదైన శైలిలో విచారించగా, తామే హతమార్చినట్లు కొడుకులు ఒప్పుకున్నారు. మృతుడి భార్య మల్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications