ఏపీ, తెలంగాణల్లో పట్టాలెక్కిన పాసింజర్ రైళ్లు: 16 నెలల తరువాత తొలిసారిగా
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారంచడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసిన పాసింజర్ సర్వీసులు దశలవారీగా పునరుద్ధరణకు నోచుకుంటోన్నాయి. గత ఏడాది కరోనా వైరస్ విస్తరించడం మొదలైన తరువాత రద్దయిన పాసింజర్ సర్వీసులను అన్ని రైల్వే జోన్లు దశలవారీగా పట్టాలెక్కిస్తూ వస్తోన్నాయి. తాజాగా సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న దక్షిణమధ్య రైల్వే వంతు వచ్చింది. ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించింది.
ప్యాసింజర్ రైళ్లు పునఃప్రారంభం కావడం 16 నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఇదే తొలిసారి. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో దశలవారీగా 66 సర్వీసులు ఇవ్వాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలిరోజు మొత్తం 18 సర్వీసులు ప్రారంభమౌతాయి. ఇందులో తొమ్మిది చొప్పున ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 22వ తేదీ వరకు దశలవారీగా 66 ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతాయి. వాటితోపాటు స్పెషల్ ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారలు అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
ఖాజీపేట్-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, హైదరాబాద్-పూర్ణ, పూర్ణ-హైదరాబాద్, విజయవాడ-గూడూరు, కాకినాడ పోర్టు- విజయవాడ, కాకినాడ పోర్టు-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ పోర్టు మధ్య ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపిస్తోంది. వాడి-కాచిగూడ, ఫలక్నుమా-వాడి, డోర్నకల్-ఖాజీపేట్, విజయవాడ-డోర్నకల్, సికింద్రాబాద్-కలబురగి, కాచిగూడ-మహబూబ్నగర్, మహబూబ్నగర్-కాచిగూడ, కాచిగూడ-నడికుడి, నడికుడి-కాచిగూడ, కాచిగూడ-కరీంనగర్ మధ్య ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

భద్రాచలం రోడ్-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-ఖాజీపేట్ ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ మంగళవారం పట్టాలెక్కుతుంది. అదే రోజు నుంచి వరంగల్-సికింద్రాబాద్, హైదరాబాద్-ఖాజీపేట్, కరీంనగర్-పెద్దపల్లి, పెద్దపల్లి-కరీంనగర్, కరీంనగర్-కాచిగూడ, కలబురిగి-సికింద్రాబాద్ మధ్య ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. బుధవారం నుంచి గుంటూరు-కాచిగూడ మధ్య ఎక్స్ప్రెస్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
దానితోపాటు ఖాజీపేట్-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, సికింద్రాబాద్-మనోహరాబాద్, మనోహరాబాద్-సికింద్రాబాద్, కాచిగూడ-రాయచూరు, రాయచూరు-కాచిగూడ, పర్లీ-ఆదిలాబాద్, విజయవాడ-మంచిర్యాల ప్యాసింజర్ సర్వీసులు నడుస్తాయి. 22వ తేదీన కాచిగూడ-గుంటూరు మధ్య ఓ ఎక్స్ప్రెస్, ఆదిలాబాద్-పర్లి మధ్య ఓ ప్యాసింజర్ రైలును నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కోవిడ్ ప్రొటోకాల్స్ను ప్రయానికులు పాటించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications