సికింద్రాబాద్లో 4 ప్రధానమైన రైళ్లకు స్టాప్స్ రద్దు.. చర్లపల్లికి మార్పు
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యామ్నాయంగా మరో రైల్వే టెర్మినల్ ఉండాలని భావించి చర్లపల్లిని ఎంచుకున్నారు. 100 సంవత్సరాల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరంలో మరో రైల్వేస్టేషన్ సరికొత్తగా రూపుదిద్దుకుంది. చర్లపల్లిలో మొత్తం తొమ్మిది ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. టెర్మినల్ అభివృద్ధి కోసం రూ.450 కోట్లు ఖర్చుపెట్టారు. దీంతో చర్లపల్లి నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్ గా రూపుదాల్చింది. ఈ క్రమంలోనే కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపడంతోపాటు మరికొన్నిరైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. తాజాగా మరో నాలుగు రైళ్లకు సికింద్రాబాద్ స్టాప్ తీసేసి చర్లపల్లికి మార్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ.720 కోట్లతో విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దే పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విశాఖపట్నం-లింగంపల్లి, లింగపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ కు శాశ్వతంగా బేగంపేట, సికింద్రాబాద్ స్టాప్స్ రద్దు చేశారు. ఈ రైలు లింగంపల్లి నుంచి సనత్ నగర్, అమ్ముగూడ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్ లో ఉదయం ఏడుగంటలకు బయలుదేరే ఈ రైలు ఎక్కాలంటే వచ్చే నెల 25వ తేదీ నుంచి చర్లపల్లి వెళ్లాల్సిందే. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

తిరుపతి - ఆదిలాబాద్, ఆదిలాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ ఈ నెల 26 నుంచి చర్లపల్లి టెర్మినల్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. చర్లపల్లి, బొల్లారం మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి.
కాకినాడ - లింగంపల్లి, లింగంపల్లి - కాకినాడ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 2 నుంచి జులై 1 వరకు చర్లపల్లి మీదుగా నడుస్తాయి.
కాజీపేట నుంచి నడిచే హడప్సర్, హడప్సర్ నుంచి కాజీపేట మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును కూడా సికింద్రాబాద్ వచ్చే పనిలేకుండా చర్లపల్లి మీదుగా దారిమళ్లించారు.
ఈ నాలుగు రైళ్లతోపాటు ఇప్పటికే చెన్నై సెంట్రల్ - హైదరాబాద్, హైదరాబాద్ -చెన్నై సెంట్రల్ మధ్య నడిచే రైలును, గోరఖ్ పూర్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్ -గోరఖ్ పూర్ మధ్య నడిచే రైళ్ల ను కూడా శాశ్వతంగా చర్లపల్లికి మార్చారు. ఈ రైళ్లను అందుకోవడానికి వీలుగా ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానంగా నడుపుతున్నారు.












Click it and Unblock the Notifications