రేపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు: రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి బుధవారం నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఆదివారం కూడా భారీ వర్షం కురుస్తుందని తెలిపారు.
రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాల్లో కదలికలు భారీగా ఉండవచ్చని, వీటి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు. వాస్తవానికి తెలంగాణలో సోమవారం నుంచి వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని, ఉష్ణోగ్రతలు చాలా జిల్లాల్లో తగ్గాయని తెలిపారు.
అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు జూన్ 1నే కేరళను తాకగా.. నాలుగు రోజుల్లోనే తెలంగాణలో అడుగుపెట్టాయి.
కానీ, ఈ ఏడాది కేరళలో మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టినప్పటికీ.. తెలంగాణలో మాత్రం కొంత ఆలస్యంగా బుధవారం అడుగుపెట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.