నీ అంతు చూస్తా, ఊచలు లెక్కపెట్టిస్తా, అప్పుడే గజ్వెల్ వదిలి వెళ్తా: వంటేరుపై హరీష్ రావు
Recommended Video
సిద్దిపేట: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ను ఓడించాలని మంత్రి హరీష్ రావు తనకు ఫోన్ చేశారని, అందుకు తనకు ఫండ్ కూడా సహాయం చేస్తానని చెబితే తానే వద్దని అన్నానని, త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
తనపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే వంటేరుపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తాను జీవితాంతం టీఆర్ఎస్లోనే ఉంటానని, చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే నడుస్తానని చెప్పారు. కనీసం సర్పంచ్ సీటు కూడా గెలవలేననే ఉద్దేశ్యంతోనే వంటేరు ప్రతాప్ రెడ్డి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయాల్లో నీ అంతు చూస్తా
తనపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే రాజకీయంగా వంటేరు ప్రతాప్ రెడ్డి అంతు చూస్తానని హరీష్ రావు హెచ్చరించారు. అతని మాటలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. గోబెల్స్ ప్రచారాలతో రాజకీయాలు నడవవని చెప్పారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుకు పట్టే అవకాశవాది అన్నారు. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. ఆధారాలు చూపకుంటే ఊచలు లెక్కపెట్టిస్తా అన్నారు.
డిపాజిట్లు గల్లంతయ్యే వరకు గజ్వెల్లోనే ఉంటా
గజ్వెల్ ప్రజలకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంగతి తెలిసిపోయిందని, ఆయన డిపాజిట్లు గల్లంతయ్యే వరకు తాను గజ్వెల్ నియోజకవర్గంలోనే ఉంటానని హరీష్ రావు చెప్పారు. వంటేరు సంగతి తేల్చాకే గజ్వెల్ నుంచి వెళ్తానని చెప్పారు. తాను వారం రోజులుగా గజ్వెల్లో మకాం వేసి ప్రచారం చేస్తుంటే పునాదులు కదిలిపోయాయని, డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని, మూడోసారి ఓడిపోతున్నాడని చెప్పారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయం అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వంద సీట్లు సాధించి తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. పార్టీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వలేని నిస్సహాయస్థితిలో కాంగ్రెస్ ఉందని రాహుల్ గాంధీకి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఓటమి తప్పదన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు వచ్చినా గజ్వెల్లో విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
అధికారంలోకి వస్తే ఈ పని చేస్తారా?
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మీ పథకాన్ని బంద్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలా చేస్తే ఆ పార్టీ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎత్తేస్తామని చెబుతున్నారని, పూటుగా తాగి, వాహనాలు నడిపినా ఫర్వాలేదా అని మండిపడ్డారు.
వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలపై కేసు
కాగా, ఇదిలా ఉండగా హరీష్ రావు పైన వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గజ్వెల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు దేవీ రవీందర్ ఈ ఫిర్యాదు చేశారు. హరీశ్ రావుపై వంటేరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపకుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఘన్పూర్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వంటేరు ప్రచారాన్ని తెరాస నేతలు అడ్డుకున్నారు.