తెలంగాణ ఉద్యమాన్ని మించి: నటి శ్రీరెడ్డి, 'సుప్రీంలో పిల్ డీజీపీ నుంచి కేంద్రం వరకు'
హైదరాబాద్: తన ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుందని, అంతకుమించి పోరాటం చేస్తామని సినీ నటి శ్రీరెడ్డి అన్నారు. ఆమె బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ పోరాటం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల శ్రీరెడ్డి అంశం టాలీవుడ్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. శ్రీరెడ్డి అంశానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఆ తర్వాత సమసిపోయినప్పటికీ వివాదం మాత్రం కొనసాగుతోంది. తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు.
న్యాయపోరాటం చేస్తా
మహిళల్లో తెగింపు వస్తే ఏ విధంగా స్పందిస్తారో తన తదుపరి కార్యాచరణతో తెలుస్తుందని, తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని శ్రీరెడ్డి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా తాను ఏం చేస్తానో ఆమె వివరించారు. యూట్యూబ్లో తన వీడియోల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిపై న్యాయ పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆ పిల్లో అన్ని రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర ప్రభుత్వాన్ని
ఈ సందర్భంగా ఇటీవల కలకలం రేపిన డబ్బుల అంశంపై కూడా ఆమె స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు, ఆమెకు డబ్బులు ఆఫర్ చేసిన అంశంపై శ్రీరెడ్డి స్పందించారు. తాను డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, ఇవ్వడానికి కొందరు ప్రయత్నించింది నిజమే అన్నారు. తాను ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ పైన త్వరలో సుప్రీం కోర్టులో పిల్ వేస్తానని, అన్ని రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖ, కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీలుగా చేర్చనున్నట్లు చేర్చనున్నట్లు శ్రీరెడ్డి లాయర్ తెలిపారు.
అక్కడే సందిగ్ధత
కాగా, ఇటీవల సినీ పరిశ్రమలోని మహిళల భద్రత గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను టాలీవుడ్ తీవ్రంగా పరిగణించిందని, పలు సమస్యలను పరిష్కరించినట్లు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పేర్కొన్నారు. ఇటీవల కొందరు మరో ప్లాట్ ఫాంలో వారి బాధలు వెల్లడించిన నేపథ్యంలో సందిగ్థత ఏర్పడిందని, అందుకే పరిశ్రమలోని అన్ని వర్గాలు ఏకమై అంశాలను కూలంకషంగా చర్చించి సరైన తీరులో సక్రమంగా స్పందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
వారికి ఓ ప్యానల్
ఇందులో, సెక్సువల్ హరాస్మెంటుకు వ్యతిరేకంగా ప్యానెల్ నియమించడం, ఇందులో సగం మంది ఇండస్ట్రీ బయట ఉండే వ్యక్తులు ఉంటారని, నియమ నిబంధలకు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లైంగిక వేధింపులపై ఏర్పాటు చేయనున్న ప్యానల్లో షఈ టీంలో ఒక డైరెక్ట్ హాట్ లైన్ ఉంటుందని, దీని ద్వారా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. సినీ పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే నటీనటులకు మార్గనిర్దేశనం చేసేందుకు ఒక ప్యానల్ ఏర్పాటు చేస్తామన్నారు.