తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే సీట్లెన్ని, డిసైడింగ్ ఫ్యాక్టర్ - తేల్చేసిన తాజా సర్వే..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. అధికారం ఈ సారి ఖాయం చేసుకోవాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఈ సమయంలోనే కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా తెలంగాణ పైన ఫోకస్ చేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ గెలిచే సీట్లు ఎన్ని..ఏం చేయాలి...అసలు అధికారం సాధ్యం అయ్యేనా అనే అంశాలపైన పార్టీ నాయకత్వానికి కీలక సర్వే అందింది.
తెలంగాణలో ఇదీ పరిస్థితి: కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. తెలంగాణలో పరిస్థితిపైన రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీ హైకమాండ్ కు కీలక నివేదిక సమర్పించారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితుల పైన అంచనాలను వివరించారు. ఈ నివేదిక ఆధారంగా తాజాగా హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశమైన ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ కీలక సూచనలు చేసారు.

పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష చేసారు. సునీల్ కనుగోలు ఇచ్చి నివేదిక ఆధారంగా మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చేయాల్సిన మార్పులు..అనుసరించాల్సిన వ్యూహాలు గురించి సర్వే నివేదిక ఆధారంగా మార్గనిర్దేశకం చేసారు.
41 స్థానాల్లో గెలుపుకు ఛాన్స్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని సునీల్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని సూచించారు. 36 స్థానాల్లో మాత్రం గెలుపు అంత సులభం కాదని తేల్చసారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని సునీల్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు పార్టీ నేతల సమాచారం.
గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా ఎన్నికల ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. పరిస్థితి బాగోలేదని చెప్పిన 36 నియోజకవర్గాల్లో ఏం చేయాలి.. ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలనే దాని పైన నివేదికలు కోరినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ ను ధీటుగా ఢీ కొట్టేనా: కాంగ్రెస్ ఆకర్షణీయ మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. దీని కోసం పలు రకాలుగా అభ్యర్ధుల ఎంపిక మొదలు..అన్ని స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ వరుసగా ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్ పైన శాసనసభలో ప్రకటనకు సిద్దం అయ్యారు.
తన పాలనలో తెలంగాణ సాధించిన పురోగతి..దక్కిన ఖ్యాతిని అసెంబ్లీ వేదికగా వివరించేందుకు సిద్దమయ్యారు. వంద సీట్లకు పైగా గెలుస్తామని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. బీజేపీలో అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది. దీనిని అనుకూలం గా మలచుకొనేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు..సునీల్ ఇచ్చిన నివేదికతో ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications