నిండు ప్రాణాన్ని బలిగొన్న 'డస్టర్'.. అక్కడికక్కడే కుప్పకూలి..
బ్లాక్ బోర్డును తుడిచే 'డస్టర్' విషయమై భానుప్రకాష్ కు మరో విద్యార్థికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కొత్తగూడెం: విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న చిన్న గొడవ తీవ్ర ఘర్షణగా మారి ఏకంగా ఓ విద్యార్థి ప్రాణాలే పోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రగొండ మండల ప్రభుత్వ పాశాలలో ఈ ఘటన జరిగింది.
బ్లాక్ బోర్డును తుడిచే 'డస్టర్' విషయమై భానుప్రకాష్ కు మరో విద్యార్థికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిన్న వివాదం కాస్త పెద్దదిగా మారి ఇద్దరు ఘర్షణకు దిగారు. భానుప్రకాష్ కు పిడిగుద్దులు బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అప్రమత్తమైన సహచర విద్యార్థులు.. ఉపాధ్యాయుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే భానుప్రకాష్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్దారించారు. ఘటన విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి దీనిపై విచారణ జరిపించాల్సిందిగా ఆదేశించారు.
జరిగిన సంఘటనలో స్కూల్ హెడ్ మాస్టర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని విద్యాశాఖ అధికారి అన్నారు. హెడ్ మాస్టర్ సహా ఆమె స్థానంలో విధుల్లో ఉన్న ఇన్ చార్జీ టీచర్ ను సస్పెండ్ చేశారు. భానుప్రకాష్ మృతికి కారణమైన విద్యార్థిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.