Manipur: మణిపూర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ, ఏపీ విద్యార్థులు..
మణిపూర్లో చిక్కుకుపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 214 మంది తెలుగు విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.22 గంటలకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. 2014 విద్యార్థుల్లో 106 మంది విద్యార్థులు తెలంగాణకు చెందినవారు కాగా, మిగిలిన 108 మంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందినవారు.
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, అధికారులు విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా అధికారులు ఆహారం, రవాణా కూడా ఏర్పాటు చేశారు. మణిపూర్ నుంచి క్షేమంగా తిరిగి రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తమ విద్యా సంస్థల చుట్టూ జరుగుతున్న హింస కారణంగా తమ భద్రత గురించి తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు.

" మణిపూర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. మా కాలేజీ చుట్టుపక్కల ఇళ్లలో పేలుళ్లు జరగడంతో భయంతో జీవిస్తున్నాం'' అని ఓ విద్యార్థి తెలిపారు.కళాశాల అధికారులు నిస్సహాయంగా ఉన్నారని, స్థానిక సిబ్బంది తమ విధులను వదిలేశారని మరో విద్యార్థి చెప్పారు. తమను సురక్షితంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
మణిపూర్లోని ఎన్ఐటీ నుంచి మొత్తం 26 మంది విద్యార్థినులు హైదరాబాద్కు చేరుకున్నారని మరో విద్యార్థి స్పూర్తి తెలిపారు. ఎమ్మెల్సీ కె.కవిత తమతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మణిపూర్లో తెలంగాణకు చెందిన 180 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని మంత్రి మల్లా రెడ్డి తెలిపారు. మిగిలిన విద్యార్థులు కోల్కతా చేరుకున్నారని.. సోమవారం రాత్రికి హైదరాబాద్లో దిగనున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మణిపూర్ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ అధికారులను సంప్రదించారు. విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారి ప్రయాణ ఖర్చులను చెల్లించింది. సోమవారం రాత్రికి మరో ప్రత్యేక విమానం హైదరాబాద్లో ల్యాండ్ కానుంది. విద్యార్థులు రాయ్పూర్, పాట్నా, భువనేశ్వర్ నుండి వివిధ విమానాల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోనున్నారు.
హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులను ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, ప్రోటోకాల్ విభాగం కార్యదర్శి అరవింద్ సింగ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, ఇతర అధికారులు విద్యార్థులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications