బాలకార్మికుడి నుంచి బాహుబలిగా -పేదరికం ఎదుగుదలకు అడ్డుకాదు -ఐఆర్ఎస్ అధికారి సురేశ్ సక్సెస్ స్టోరీ
బాహుబలి అంటే బలమైన భుజాలు కలవాడని అర్థం. పూట గడవటమే కష్టంగా ఉండే పేదలు.. రెక్కలు ముక్కలు చేసుకోవడం తప్ప బలప్రదర్శనంటూ చేయలేరు. అయితే, తక్కువ సత్తువున్న భుజాలన్నీ ఐక్యమై సమిష్టి బాహుబలిగా మారడం కూడా కష్టమేమీ కాదు. అందుకు కావాల్సిందల్లా విశ్వాసం, పట్టుదల. భూస్వామి దగ్గర బాలకార్మికుడిగా పనిచేసిన సురేశ్.. విశ్వాసం, పట్టుదలనే తన రెండు భుజాలుగా మార్చుకుని.. స్నేహితుల సహకారంతో ఉన్నత స్థాయికి ఎదిగి.. తనలాంటి ఎంతో మందికి భుజం కాస్తూ.. వాళ్ల జీవితాల్లోనూ బలాన్ని నింపుతూ అసలైన బాహుబలిగా ముందుకు సాగుతున్నాడు..

రైల్వే ట్రాకే వాళ్లకు రోడ్డు
ఆ తండా వాసులకు తెలిసిన ఏకైక రోడ్డు.. రైల్వే ట్రాక్. అవును. పట్టాల వెంబడి పిల్లబాట మీదుగా 2కిలోమీటర్లు నడిస్తేగానీ ఇంకో ఊరు చేరలేరు. 10 కిలోమీటర్ల సాహసం చేస్తేతప్ప సమీపంలోని పట్టణం కనిపించదు. భారత్ వెలుగులు, బంగారు తెలంగాణ నినాదాలకు దూరంగా రోదించిన ఆ తండాలో 2012 దాకా కరెంటు లేదంటే నమ్ముతారా? వర్షాకాలం వస్తే దారులన్నీ బురదమయం అయ్యి, మోకాలిలోతు దిగబడేవి. రక్షిత మంచినీరు కూడా లేక అక్కడి ప్రజలు బోర్లు, వ్యవసాయబావుల నీళ్లే తాగేవారు. సాగుకు భూమి తప్ప ఆల్మోస్ట్ చీకటిలోనే మగ్గిన ఆ తండాలో కొన్నేళ్ల కిందట ఓ చిన్న వెలుగు రేఖ ఉదయించింది. దాని పేరు లకావత్ సురేశ్ నాయక్. జీవితపు చీకట్లను చీల్చుకుంటూ.. ఐఆర్ఎస్ అధికారి స్థాయికి చేరిన ఆయన తన తండాతోపాటు చుట్టుపక్కల ఊళ్లలో వెలుగులు నింపాడు..

పట్టుకుపోయిన భూస్వామి..
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం సర్వాపురం తండా.. సురేశ్ సొంతూరు. తాతల నుంచీ వ్యవసాయ కూలీలుగా పనిచేసేవాళ్లు. తనకు ఐదేళ్ల వయసులో ఓ రోజు తాతతో కలిసి పొలానికి వెళ్లగా, అక్కడున్న భూస్వామి.. ‘వీణ్ని మా ఇంట్లో పనికి తీసుకుపోతున్నా'అంటూ ఏకవాక్య ఆదేశంతో పిల్లాడిని పట్టుకెళ్లాడు. అలా ఐదేళ్లప్పుడే తన తండాకు దూరమయ్యానని, కొన్నాళ్లపాటు భూస్వామి ఇంట్లోనే పని చేస్తూ, వాళ్ల పిల్లలతోపాటే చదువుకునేవాడినని సురేశ్ గుర్తుచేశారు. ప్రఖ్యాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్ పీఎస్-బేగంపేట)లో ఎంట్రెన్స్ కోసం తాను కూడా పరీక్ష రాయగా, భూస్వామి పిల్లలకు రాని సదావకాశం సురేశ్ కు దక్కింది. అంతే, ఫలితాల రోజే ‘ఇంట్లో నుంచి వెళ్లిపోరా...'అని భూస్వామి నుంచి చివరి ఆదేశం వెలువడింది. సురేశ్ తన తండ్రితో కలిసి రైల్వే ట్రాక్ ఎక్కాడు..

20 రోజులు ఫుట్పాత్పై జీవనం
బడా బాబుల పిల్లలు చదివే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎస్టీ రిజర్వేషన్ కోటాలో సురేశ్ కు సీటొచ్చింది. కానీ భూస్వామి ధనసహాయ నిరాకరణ కారంణంగా స్కాలర్ షిప్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. తండ్రితో కలిసి హైదరాబాద్ లో చేరిన సురేశ్.. మసాబ్ ట్యాంక్ లోని సంబంధిత ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, 20 రోజులపాటు అక్కడే ఫుట్ పాత్ పై రాత్రులు గడిపారు. ఎట్టకేలకు స్కాలర్ షిప్ మంజూరు కావడంతో హెచ్పీఎస్ లో చేరాడు. తనకంటే వెయ్యింతలు ధనవంతులైన తోటి పిల్లలో అంత సులువుగా కలిసిపోలేక సురేశ్ ఆత్మన్యూనతకు గురయ్యాడు. అనుకోకుండానే తన ఇన్ఫీరియారిటీని దూరం చేసుకోడానికి ఆటల బాట పట్టాడు..

హెచ్పీసీలో ఇప్పటికీ అదొక రికార్డు..
ఎస్టీ రిజర్వేషన్, మారుమూల తండా, అప్పటిదాకా పక్కన ఊర్లు తప్ప పట్టణాలు ఎరగని పిల్లాడు.. మానసిక, సామాజిక హార్డిల్స్ను దాటుకుంటూ స్కూల్లో బెస్ట్ అథ్లెట్ గా మారిపోయాడు. ట్రాక్, ఫీల్డ్లో సత్తా చాటుకుంటూ ఏకంగా 277 మెడల్స్ సాధించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చరిత్రలో ‘హెడ్ బాయ్' హోదాను సాధించిన ఏకైక ఎస్టీ విద్యార్థి సురేశ్. ఐసీఎస్సీ, ఐఎస్సీ స్కూల్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. స్కూల్లో, హాస్టల్ లో ఎదురయ్యే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి బయటపడటానికి స్పోర్ట్స్ తనకెంతగానో ఉపకరించాయని, అందుకోసమే తాను ట్రాక్ ఎక్కానని సురేశ్ చెబుతారు.

దోస్తుల ఆశ్రయంతో ఢిల్లీలో చదువు..
2005లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పాసౌటైన సురేశ్.. తన క్లాస్ మేట్, దగ్గరి స్నేహితుడి అండతో ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కాలేజీలో చేరాడు. అక్కడ సురేశ్ వసతి, చదవుకు అయ్యే మొత్తాన్ని ఆ స్నేహితుడే చూసుకున్నాడు. అందుకే, ఇవాళ్టికి కూడా సురేశ్ పదే పదే.. ‘‘స్నేహితుల పోత్సాహం వల్లే ఇవాళ నేనీ స్థాయికి చేరుకున్నా'' అని చెబుతారు. 2008లో డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. తర్వాతి ఏడాదిలోనే సివిల్స్ ర్యాంకు సాధించారు. నాగపూర్ లోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్' ఐఆర్ఎస్ అకాడమీలో చేరారు. ఆ మూడేళ్ల శిక్షణలోనే సురేశ్ కు తన బ్యాచ్ మేట్ కనికా అగర్వాల్ తో పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయి. 2013లో పెళ్లి బంధంతో ఒకటైన సురేశ్-కనికలకు అధ్వర్వ్(7), రుద్రా(1) ఇద్దరు కొడుకులు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్ లో ఫస్ట్ పోస్టింగ్ లో చేరడానికి ముందు నుంచే ఊరిపై ఫోకస్ పెంచాడు సురేశ్..

భుజం భుజం కలిస్తేనే బాహుబలం
యువ ఐఆర్ఎస్ అధికారి, ఇన్కమ్ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సురేశ్నాయక్ చొరవతో సర్వాపురం తండా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అతనే నాయకుడిగా ఊళ్లోని యవకులంతా అసోసియేషన్గా ఏర్పడి, తండా అవసరాలు, అభివృద్ధిపై ఫోకస్ పెంచారు. తండాకు కరెంట్ లైన్లు వేయించగలిగారు. ఇప్పుడా వీధుల్లో ఎల్ఈడీ బల్బులను అమర్చారు. దాతల సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు వేయించారు. స్కూల్, ఇతర సామూహిక భవనాలను అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక లైబ్రరీలు, వాటిలో కంప్యూటర్లను ఏర్పాటు చేయించిన సురేశ్.. తండాలు, గ్రామాల్లోని ఔత్సాహిక విద్యార్థులకు అవెంతో అవసరమని చెబుతారు. తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్ నుంచి తండా వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం చేసిన కృషి ఎట్టకేలకు నెరవేరింది. ఒకప్పుడు విసిరేసినట్టున్న సర్వపురం తండా రోడ్డు రాకతో పది తండాలకు కేంద్రంగా మారింది. అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. ఊళ్ల నుంచి చీకటి పారదోలడానికి తెలంగాణ సర్కారు కూడా సహకరించింది. ‘‘నా ఆశయం ఒక్కటే! మన ఎదుగుదల మన ఊరికి దోహదపడాలి. అప్పుడే మనం సాధించిన విజయాలకు, మన హోదాలకు సార్థకత. అందుకే తండా అభివృద్ధికి కృషి చేస్తూ రుణం తీర్చుకుంటున్నా. యువతరానికి నేను చెప్పేదొక్కటే! పేదరికం ఎదుగుదలకు అడ్డుకాదు. దృఢ సంకల్పంతో ముందుసాగాలి. అప్పుడే విజయం సాధ్యం" అని చెబుతారు ఐఆర్ఎస్ అధికారి లాకావత్ సురేశ్ నాయక్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications