టి-టిడిపికి షాక్: కెసిఆర్కు సుజనా ప్రశంస, కూతురుతో వచ్చిన మంచు లక్ష్మీ
హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు ఆయన సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కోణార్క్ సర్టిఫికేషన్ పేరిట సౌర శక్తి కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధృవపత్రాలిచ్చారు.
ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రులూ (చంద్రబాబు, కెసిఆర్) సమర్థులేనని చెప్పారు. బాబు, కెసిఆర్లు తెలుగు ప్రజల సంక్షేమం కోసం ప్రయోజనకరమైన పథకాలను ప్రవేశపెట్టి, సమర్థంగా అమలుపర్చగల పరిపాలనా దక్షులన్నారు.
భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 65 శాతం యువశక్తి, నైపుణ్యం దేశానికి పెట్టని కోటలు అన్నారు. విద్యుత్ ఉత్పాతక రంగంలో దేశం పురోగమిస్తోందని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పీవీ నర్సింహా రావు గొప్ప కృషి చేశారన్నారు. కాగా, కెసిఆర్ను సుజనా చౌదరి పొగడటం తెలంగాణ టిడిపికి ఒకింత ఇబ్బందేనని చెప్పవచ్చు.
పింక్ రిబ్బన్ వాక్ను ప్రారంభించిన హరీష్ రావు
భాగ్యనగరంలోని కేబీఆర్ పార్కులో నిర్వహించిన పింక్ రిబ్బన్ వాక్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సినీనటి మంచులక్ష్మీ, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువతులు పాలుపంచుకున్నారు. వాక్ను ప్రారంభించిన హరీశ్ రావు మాట్లాడుతూ... బ్రెస్ట్ కేన్సర్ లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ మంచు లక్ష్మీ తన కూతురును తీసుకు వచ్చింది.