తెలంగాణలో మండుతున్న ఎండలు: నల్గొండలో 42 డిగ్రీలు, రెండ్రోజులు వడగాలులు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వేసవి కాలం మొదలైపోయింది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండలు మండిపోతున్నాయి. అప్పుడు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేస్తోంది. నేడు, రేపు కూడా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలలో మార్చ్ మొదటి వారం నుంచే పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు మే నాటికి 46-47 డిగ్రీల వరకూ చేరవచ్చని తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే స్వల్పంగా వడగాలులు కూడా ప్రారంభమయ్యాయి.
ముఖ్యంగా గురు, శుక్రవారా(నేడు, రేపు)ల్లో తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు ఎక్కువగా వీచే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఇక తెలంగాణ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. నల్గొండలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ. గత పదేళ్లకాలంలో ఇదే అత్యధికం.
మరోవైపు, అదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. క్రమంలో ఏప్రిల్, మే నాటికి పగటి ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ, ఏపీలోకి వీస్తున్న గాలుల ప్రభావంతో..వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. వడగాల్పుల కారణంగా గాలిలో తేమ లేక, ఉక్కపోత అధికంగా ఉండనుంది.
ఇదిఇలావుండగా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. మార్చ్ 21 నాటికి తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చ్ 19 నాటికి తీవ్ర అల్పపీడనంగా, మారి 20 నాటికి వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత 21వ తేదీకు తుఫానుగా మారి.. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ.. మార్చి 23 నాటికి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరానికి చేరనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.