సుపారీ హత్యలకు కుట్ర: నిందితుల అరెస్ట్(ఫొటో)
హైదరాబాద్: సుపారీ హత్యలకు కొందరు దుండగులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వారిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం పురానీహవేలీలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో టాస్క్ఫోర్సు అదనపు కమిషనర్ ఎన్.కోటిరెడ్డి, చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి లతో కలిసి దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ వివరాలను వెల్లడించారు.
కర్ణాటకలోని బీదర్లోని దివంగత ఎంఎ రజాక్ ఇద్దరు భార్యలు జైనబున్నిసాబేగం, జరీనాబేగం నడుమ ఆస్తి పంపకంలో రెండేళ్ల క్రితం వివాదం నెలకొంది. జైబున్నీసాకు ఆరుగురు కుమారులు, నల్గురు కుమార్తెలు ఉన్నారు. రజాక్ రెండో భార్య జరీనాబేగంకు మహ్మద్ ఖుద్దూస్(24), ఫరూక్(22) కుమారులు. వీరిలో మహ్మద్ ఖుద్దూస్ బీదర్లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతని సోదరుడు ఫరూక్ హైదరాబాద్ నగర శివారు షాద్నగర్లోని నూర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. జైబున్నీబేగం పక్షాన ఉండి.. ఆస్తుల వివాదానికి మధ్యవర్తిగా ఉండే బీదర్లోని సలీంచౌదరి(45)పై ఖుద్దూస్ కక్ష పెంచుకున్నాడు.

బీదర్లోని ఉమ్మడి కుటుంబానికి చెందిన అయిదు ఏకరాల భూమిని జైబున్నీసాబేగం పెద్దకుమారుడి అబ్దుల్ హక్కు చెందేలా మధ్యవర్తి సలీంచౌదరి చూశారు. అలాగే సోదరుడు ఫరూక్తో కూడా ఆస్తుల విషయమై విభేదాలు వచ్చాయి. సుఫారీతో సలీం చౌదరిని, సోదరుడు ఫరూక్ను పథకం ప్రకారం హత్య చేయించాలని ఖుద్దూస్ నిర్ణయించుకున్నాడు. నగరంలోని మాసాబ్ట్యాంక్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే బీదర్కు చెందిన తన మిత్రుడు నియామత్(26)ను సంప్రదించాడు.
నియామత్ పాతబస్తీ హసన్నగర్లోని తన బంధువు ఆటోడ్రైవర్ షేక్ఫరీద్(25) ఖుద్దూస్ పథకాన్ని వివరించాడు. ఆటోడ్రైవర్ షేక్ఫరీద్ తన మిత్రుడు, కాలాపత్తర్కు చెందిన అబ్దుల్ఖరీం(42) ఎలియాస్ డాన్కు హత్యపథకం వివరాలను తెలియజేశాడు. ఇందుకు డాన్ సుపారీగా పదిలక్షలు చెల్లిస్తే.. సలీంచౌదరి, ఫరూక్ను హత్యచేస్తామని అంగీకారం కుదుర్చుకున్నాడు. డాన్కు ఖుద్దూస్ తొమ్మిది లక్షల రూపాయలను చెల్లించాడు. డాన్కు తోడుగా హసన్నగర్ ఆటోడ్రైవర్, బీదర్కు చెందిన అమేర్ఖాన్(22), బాల్కీ షాకీర్(24) ఉంటారని పథకంలో భాగంగా నిర్ణయించారు.
ఈ పథకాన్ని అమలు చేయాలని మంగళవారం కాలాత్తర్లోని డాన్ నివాసానికి ఖుద్దూస్తోపాటు నియామత్,షేక్ ఫరీద్ వెళ్లారు. ఈ సమాచారం దక్షిణ మండలం టాస్క్ఫోర్సు పోలీసులు అందింది. దీంతో వారు కాలాపత్తర్ పోలీసులతో కలిసి డాన్ నివాసంపై దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు ఖుద్దూస్తోపాటు డాన్, షేక్ ఫరీద్, నియామత్లను అదుపులోకి తీసుకున్నారు. అమేర్ఖాన్, షాకీర్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి పాతనగరంలోని ఆటోడ్రైవర్కు చెల్లించిన 2.5లక్షల నగదు, రెండు కత్తులు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications