‘ఏబిఎన్ ఆంధ్రజ్యోతి’ ప్రసారాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలనిచ్చింది. ఈ మేరకు కేంద్రం, తెలంగాణ ఎంఎస్ఓలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఆదేశాల ప్రతులను పంచాలని, అవసరమైతే ఎంఎస్ఓలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీవీ9 ఛానల్ విషయంలో పాటించిన టీడీశాట్ ఆదేశాలను ఏబీఎన్ విషయంలోనూ అమలు చేయాలని స్పష్టం చేసింది.
మంగళవారం నాటికి ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోయి 506 రోజులు గడిచాయి. తాజాగా సుప్రీం తీర్పుతో ప్రసారాలు పునః ప్రసారం కానున్నాయి. జస్టిస్ ఖేహర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్బి లోకూర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, దాసోజు శ్రవణ్, బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ఎంఎస్వోలు వెంటనే ఏబీఎన్ ప్రసారాలను పునరుద్దరించాలన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఐజేయూ నేత దేవులపల్లి అమర్ అన్నారు. మీడియాను నిషేధించి ప్రభుత్వం తప్పు చేసిందని తాముమొదటి నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు.
తమ వాదనకు సుప్రీంకోర్టు మరింత బలం ఇచ్చిందని, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కలెక్టర్లు పాటించకపోతే కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టేనన్నారు.
తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్వేచ్చాయుత మీడియా విజయమని శాసనమండలి సభ్యుడు నాగేశ్వర్ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. అలాగే.. ఏబీఎన్ ఛానల్ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఎదురొడ్డి నిలిచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాఘం రంగారెడ్డి అన్నారు.