విభజనపై ఏమంటారు?: హైకోర్టు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వేర్వేరుగా ఎందుకు హైకోర్టులు ఏర్పాటు చేయకూడదంటూ పిటిషన్లో పేర్కొన్న కేంద్రం.. 2015, మే 1న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోర్టును కోరింది.
కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, తెలంగాణ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టు విభజన ఇక ఎంతమాత్రం జాప్యం కావడానికి వీలులేదని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, విభజన జరగాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు.

ఏపీలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా.. ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుతం హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24హాళ్లలో ఏపీకి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40శాతం ఉండాల్సిన వాటా కూడా లేదని కోర్టుకు వివరించింది. కేసు వాదనల సమయంలో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజరయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ వైఖరి తెలియజేయాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications