ఇది కొత్త స్టయిల్: మాట్లాడనివ్వకపోవడమే ప్రజాభిప్రాయ సేకరణ.. నిర్బంధం, అరెస్టుల మధ్య ముగిసిన కాళేశ్వర
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తీరు పాలకుల పారదర్శకత తీరును.. ప్రగతి పట్ల మోసపూరిత హామీల వైనాన్ని బయట పెడుతున్నది.అధికార టీఆర
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తీరు పాలకుల పారదర్శకత తీరును.. ప్రగతి పట్ల మోసపూరిత హామీల వైనాన్ని బయట పెడుతున్నది. అధికార టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే ప్రజాభీష్ఠంగా, విపక్ష నేతల అణచివేతతో, అవసరమైతే అరెస్టులతో సాంకేతికంగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందనిపించి.. కేంద్రంలో పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగుతున్నది.
కానీ పరిహారం చెల్లింపు విషయానికి వచ్చే సరికి.. ఆ ఊసెత్తిన ప్రజలు, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడానికే ప్రభుత్వం ప్రాదాన్యం ఇచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అవినీతి రహితంగా పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరు నేతి బీరకాయలో నేతి చందంగానే కనిపిస్తున్నదన్న వినిపిస్తున్నాయి.
'ముంపు గ్రామాలకు చెందిన నలుగురితోనే మాట్లాడిస్తారా? మొత్తం టీఆర్ఎస్ నేతలే మాట్లాడతారా? మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? రాత్రి పదిగంటలైనా అందరి అభిప్రాయాలనూ తీసుకుంటామని కలెక్టర్ చెబు తూనే...అర్ధాంతరంగా కార్యక్రమాన్ని ముగించడమేంటీ? మా ఆవేదన వినరా? ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ?' అని సిద్దిపేటలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో వేములఘాట్ నిర్వాసితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. భూపాలపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ పోలీసుల నిర్బంధం నడుమ జరిగింది.
ప్రశ్నించి.. రాస్తారోకో చేస్తే వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలింపు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన వయోలా గార్డెన్లో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ముంపు గ్రామాల నుంచి అనేక మంది బాధితులు డీసీఎం, ఆటోల్లో తరలివచ్చారు. కార్యక్రమానికి ముందే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాల్లో తిష్టవేశారు. దీంతో నిర్వాసితులు ఎక్కడో చివర నిలబడ్డారు. తమ భూములు ఇవ్వబోమని చెప్పేందుకు వచ్చిన 70 మంది వేములఘాట్ నిర్వాసితులను పోలీసులు అరెస్టు చేసి నంగునూరు మండలం రాజ గోపాల్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఇంత నిర్బంధం మధ్య ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని నిర్వాసితులు ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన కమిటీ 500 పేజీల నివేదికను ఇస్తే కేవలం 10 పేజీల నివేదికను మా గ్రామంలో అందుబాటులో ఉంచారని, ఇందులో ఏ మతలబ్ ఉందని నిలదీశారు. అటవీ శాఖ అనుమతి ఎప్పుడిచ్చిందో, గ్రామ సభలు ఎప్పుడు నిర్వహించారో రికార్డులు చూపాలన్నారు. 'ఏ అధికారి మా గ్రామాలకు వచ్చి అభిప్రాయం సేకరించారో చూపెట్టాలి' అని వేములఘాట్ నిర్వాసితుడు డిమాండ్ చేయడంతో అతని మైక్ లాక్కున్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేసిన 60 మందిని అదుపులోకి తీసుకుని చిన్న కోడూరు పోలీస్స్టేషన్కు తరలించారు. కొందరిని మాట్లాడనివ్వకుండా బయటకు పంపేశారు. దీంతో వారు రాస్తారోకోకు దిగగా అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్రెడ్డి, నిర్వాసితుల సంఘం జిల్లా కన్వీనర్ గొడ్డుబర్ల భాస్కర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నక్కల యాదవరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యర్తలు వారిని మాట్లాడకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. పర్యావరణంపై మాట్లాడటం లేదంటూ అధికారులు వంటేరు ప్రతాపరెడ్డి రెడ్డి మాట్లాడుతుండగా మైక్ నిలిపిచేశారు. దీంతో వంటేరు ప్రతాప్రెడ్డికి అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. బాధితులకు తక్కువ సమయం కేటాయిస్తూ అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఎక్కువ సమయం కేటాయించారని నాయకులు విమర్శించారు.
సిరిసిల్లలో విపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో ప్రజాభిప్రాయ సేకరణలో అదే మండలానికి చెందిన కాంగ్రెస్ నేత ఎగదండి స్వామి, టీడీపీ నేత ఇంబాజోల్ ఖాన్ తదితరులు 10 మంది విపక్ష నేతలు వినతిపత్రం ఇవ్వడానికి వేదికపై ఉన్న కలెక్టర్ కృష్ణభాస్కర్ దగ్గరకు వెళ్లారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల సంగతేంటని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రశ్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు పక్షాలకు మధ్య వాగ్వాదం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన తమను ఎందుకు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రశ్నించారు. చివరకు పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించడంతో విపక్ష నేతలు పోలీస్ జులుం నశించాలని నినాదాలు చేశారు. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యే వరకు వారిని పోలీసుల అదుపులోనే ఉంచుకోవడం విమర్శలకు దారి తీసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని కోరడానికి వచ్చామని, అభిప్రాయం తెలియజేయకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని విపక్ష నేతలు నిరసన తెలిపారు. గమ్మత్తేమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పర్యావరణ సమతుల్యత కోసం జరిగిన సభలో రైతుల కంటే ప్రజా వాణి పేరిట మాట్లాడిందీ అత్యధికులు అధికార టీఆర్ఎస్ వారే. టీఆర్ఎస్ పార్టీ నేతల అభినందన సభగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 352 మంది మాట్లాడితే వారిలో అత్యధికులు టీఆర్ఎస్ వారే కావడం గమనార్హం.
భూపాలపల్లిలో నిర్బంధం నడుమ అభిప్రాయ సేకరణ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభ వద్దే ఎస్పీ సహా జిల్లా పోలీసు యంత్రాంగమంతా తిష్టవేసింది. నిర్వాసితులను పోలీసులు పలుచోట్ల క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి పంపారు. మధ్యలో వచ్చిన రైతులకు లోనికెళ్లేందుకు అనుమతివ్వకపోవటంతో వర్షంలోనే నిలబడ్డారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ కాస్త టీఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయ సభగా మారిపోయింది. నిర్వాసితుల సంఘం యువజన కమిటీ అధ్యక్షులు శ్రావణ్రెడ్డిని పోలీసులు బయటే నిలిపేశారు. నిర్వాసితులు ఉండే చోట అభిప్రాయ సేకరణ చేయకుండా భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొద్దని చెప్పట్లేదు. కానీ, కొన్ని అభ్యంతరాలున్నాయి. దానిపై స్పష్టత కావాలి.....రైతులకు న్యాయం చేయాలి' అంటూ మాజీ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ భూములిచ్చిన రైతులకు పాదాభివందనాలు తెలిపారు. మాజీ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతుండగా తెరాస నాయకులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇరువర్గాల వారు పరస్పరం వాదనలు చేసుకున్నారు. పోలీసులు అందరిని సముదాయించే ప్రయత్నాలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ నేతల నిరసన
టీఆర్ఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు మాట్లాడుతుండగా మరోసారి గందగోళానికి దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నారు. తనను మాట్లాడించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పాని కిషన్ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ ప్రసంగిస్తూ జిల్లాకు సాగు, తాగునీటిని అందించాకే ఇతర ప్రాంతాలకు జలాలను తరలించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాపయ్య మాట్లాడుతూ ప్రజల ముందు ప్రాజెక్టు డీపీఆర్ను ప్రదర్శించాలని పేర్కొన్నారు. 2013 చట్టం ప్రకారం భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. సమావేశం ప్రారంభం కాగానే భారీ వర్షం కురడవంతో మందిరంలోకి నీరు వచ్చింది. కూర్చొనే అవకాశం లేకపోవడంతో చాలా మంది నిల్చునే ఉన్నారు. నాయకులే ఎక్కువగా అభిప్రాయాలు తెలియజేశారు. రైతులకు చాలా తక్కువగా అవకాశం ఇచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశ స్థలానికి వచ్చే దారిలో ఆరుచోట్ల తనిఖీలు చేపట్టారు.