'కొందరు నీచులు నేర్పుతారా, బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుంది'
హైదరాబాద్: కొందరు నీచులు కమ్యూనిస్టులకు దేశభక్తి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. ముగ్ధుం భవన్లో పార్టీ 92వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కమ్యూనిస్టులది విదేశీ సిద్ధాంతమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ది, ఆరెస్సెస్ది ఒకటే గుర్తు అని, వాళ్లు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని నీచులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లు తమకు దేశభక్తి నేర్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుంది
సీపీఐలో చీలికల వల్లే కమ్యూనిస్టులు బలహీనులయ్యారని సురవరం అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశభక్తిపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు.

మోడీ అనుచిత వ్యాఖ్యలు
గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. శాతవాహన యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాలపై ఆరెస్సెస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు.

ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
కాగా, మంగళవారం సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హిమాయత్నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవనం నుంచి మఖ్ధూం భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

ఉర్రూతలూగించిన ప్రజా నాట్య మండలి
దారిలో సాంస్కృతిక ప్రదర్శనలు అటుగా వెళ్తున్న వారికి ఆసక్తిని కలిగించాయి. మహిళలు కోలాటం ఆడుతూ, ప్రజానాట్యమండలి విభాగం పాటలు పాడుతూ అందరినీ ఉర్రూతలూగించారు.












Click it and Unblock the Notifications