కేసీఆర్ను, ఆయన కొడుకును ఏమనొద్దట: గవర్నర్పై సర్వే నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ధ్వజమెత్తారు. గవర్నర్ నరసింహన్పై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హిట్లర్లాగా నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కెసీఆర్కు ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ కూడా తోడయ్యారని మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న ఎమ్మార్పీయస్ మందకృష్ణను అరెస్టు చేసి జైలులో పెట్టడం అప్రజాస్వామికమని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎస్సీ వర్గీకరణ కార్యచరణ చేపడతామని, వర్గీకరణ తమ జన్మహక్కు అని స్పష్టం చేశారు.

మోడీ రమ్మన్నారు గానీ కెసీఆర్
హైదరాబాదులోని చంచల్గూడ జైలులో ఉన్న మందకృష్ణను సర్వే సత్యనారాయణ శనివారంం పరామర్శించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోడీ రమ్మన్నారని, అయితే కేసీఆర్ మాత్రం అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారని ఆయన అన్నారు.

కెసీఆర్ దళిత వ్యతిరేకి కాబట్టే....
కెసీఆర్ దళిత వ్యతిరేకి కాబట్టే మోడీతో అపాయింట్మెంటును రద్దు చేసుకున్నారని సర్వే సత్యనారాయణ అన్నారు. తొలుత డిప్యూటీ సీఎంగా ఓ మాదిగను పెట్టి గంజిలో ఈగను తీసినట్లు తీసేశారని ఆయన రాజయ్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ అన్నారు. తర్వాత ఒక్క మాదిగను కూడా కేబినెట్లోకి తీసుకోలేదని అన్నారు.

మాలలనైనా తీసుకున్నారా..
మాల సోదరుడినైనా కెసిఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారా అంటే అదీ లేదని సర్వే సత్యనారాయణ అన్నారు కేసీఆర్ చేస్తున్న అక్రమాలపై తాము గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు వెళితే గవర్నర్ తమకు క్లాస్ పీకుతున్నారని ఆయన అన్నారు. హెడ్మాస్టర్ లాగా తమకు పాఠాలు చెబుతున్నారని అన్నారు. తమపై గవర్నర్ టీఆర్ఎస్ కార్యకర్తలాగా మాటలు పేలారని మండిపడ్డారు.

వారిని ఏమీ అనొద్దని అంటున్నారు.
ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుమారుడు కెిట రామారావును ఏమీ అనొద్దని అంటున్నారని సర్వే సత్యనారాయణ గవర్నర్పై నిప్పులు చెరిగారు ఇసుక మాఫియా గురించి మాట్లాడొద్దంటున్నారని అన్నారు ఇసుక లారీ కింద పడి మనిషి మరణించాడని చెప్తే పడింది ఇటుక లారీకింద అని గవర్నర్ అంటున్నారని ఆయన అన్నారు.

గవర్నర్ను బర్తరఫ్ చేయాలి..
దేని కింద పడితే ఏమిటి మరణించిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయండయ్యా అంటే గవర్నర్ అలా మాట్లాడుతున్నారని సర్వే సత్యనారాయణ అన్నారు. వెంటనే గవర్నర్ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని అన్నారు. తండ్రిలాంటి గవర్నరే ఇలా చేస్తే ఇక ప్రజలకు దిక్కెవరని అడిగారు.

కోటి మంది ఉన్నారు గానీ..
రాష్ట్రంలో ఉన్న కోటి మంది మాదిగలు మందకృష్ణ వెనుకే ఉన్నారని సర్వే సత్యనారాయణ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ తమ జన్మహక్కు అని చెప్పారు. దీనికోసం తాము ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వమే చేస్తామని ముందుకొస్తే సహకరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications