భయంతోనే సస్పెన్షన్: ఎర్రబెల్లి, కెసిఆర్పై నాగం ఫైర్
కరీంనగర్/ హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై నిలదీస్తామనే భయంతోనే తెలంగాణ ప్రభుత్వం తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిందని వరంగల్ జిల్లా పాలకుర్తి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుమ్మక్కయి అసెంబ్లీని నడుపుతున్నాయని ఆయన అన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల వారికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడక తప్పదని ఆయన హెచ్చరించారు. నష్టపరిహారం చెల్లించేవరకు తమ పార్టీ రైతులకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని తమ పార్టీ వదిలిపెట్టబోదని ఆయన అన్నారు.

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎదుట ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో కలిసి టీడీపీ నేతలు శనివారం ఆందోళనకు దిగారు. ఎర్రబెల్లి దయాకర్రావు, ఎల్.రమణ, రావుల, విజయరమణారావు, ఇతల జిల్లాల నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు ధర్నాలు పాల్గొన్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు టీడీపీ నేతలు వినతిపత్రం అందజేశారు.
కెసిఆర్ వైఖరితో తిరోగమనం
ప్రధాని నరేంద్ర మోడీ వల్ల దేశానికి పెట్టుబడులు వెల్లువెత్తుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖఱితో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తిరోగమన బాట పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదే వ్యవహార శైలి కొనసాగిస్తే తెలంగాణ ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు. సమగ్ర సర్వే వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని, కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన కెసిఆర్కు సూచించారు.












Click it and Unblock the Notifications