రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ - హాజరయ్యేనా : గవర్నర్ ఆధ్వర్యంలో - రాజకీయ ఉత్కంఠ..!!
తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ వర్సెస్ ప్రత్యర్ధి పార్టీలు ఒక వైపు పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. అదే సమయంలో రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోంది. కొంత కాలంగా.. గవర్నర్ తో ప్రభుత్వం మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు దూరంగానే ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభించటంతో వివాదం తెర మీదకు వచ్చింది. అయితే, సభను ప్రోరోగ్ చేయకపోవటంతో, తిరిగి గవర్నర్ ప్రసంగం అవసరం లేదనేది ప్రభుత్వ వర్గాల వాదన.
రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం
ఇక, ఇదే అంశం పైన ఢిల్లీ పర్యటనలో గవర్నర్ చేసిన వ్యాఖ్యల పైన తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సమయంలోనే..ఇప్పుడు మరోసారి రాజ్ భవన్ వేదికగా నిర్వహించే ఒక కార్యక్రమం ద్వారా కేసీఆర్.. సీఎం హోదా లో గవర్నర్ కార్యాలయంలో జరిగే ఆ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనే చర్చ మొదలైంది. రేపు (మంగళవారం) రాజ్ భవన్ లో తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న మంత్రులు..సీఎస్..డీజీపీ సహా హాజరు కావటం ఆనవాయితీ. అయితే, సీఎం ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సీఎం కేసీఆర్ హాజరు పై సస్పెన్స్
సీఎం హాజరు అవుతారా..లేక, సీఎం ప్రతినిధిగా మంత్రి ఇంద్రకర్ రెడ్డి.. సీఎస్..డీజీపీ హాజరవుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కు మరో కార్యక్రమం ఫిక్స్ అయింది. టీ-హబ్ రెండో దశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ముందుగా టీ -హబ్ కార్యక్రమానికి కేటీఆర్ పాల్గొంటారని చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు. దీని ద్వారా రాజ్ భవన్ కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పీఎం మోదీ తెలంగాణకు వచ్చిన రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ దూరంగానే ఉన్నారు. దాదాపు పది నెలలుగా సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు రాలేదు.
హాజరుతో వివాదానికి ముగింపు ఇస్తారా
రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సైతం హాజరు కాకపోవటంతో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. దీనికి కొనసాగింపుగా గవర్నర్ తనకు ప్రభుత్వం మర్యాద ఇవ్వడం లేదంటూ బహిరంగంగానే విమర్శించారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా రాజ్భవన్లో గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించడం సైతం విమర్శలకు కారణమైంది. ఇప్పుడు జాతీయ పార్టీ పైన కసరత్తు..బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న సీఎం కేసీఆర్..రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమానికి హాజరు ద్వారా మొత్తం వివాదానికే ముగింపు పలుకుతారా, లేక.. రాజ్ భవన్ కు దూరంగానే ఉంటారా అనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.