55 రోజులు బహిష్కరించారు, 55 ఏళ్లు ఇక్కడే ఉంటా: పరిపూర్ణానంద స్వామి
హైదరాబాద్: తనను భాగ్యనగరం నుంచి 55 రోజులు బహిష్కరించారని, కానీ రాబోయే 55 ఏళ్లు ఇక్కడే ఉండి కాషాయాన్ని శాశ్వతంగా నిలబెట్టేందుకు కృషి చేస్తానని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఇటీవల ఆయనను అర్థం పర్థం లేని కారణంతో నగర బహిష్కరణ చేశారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై కోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. దీంతో ఆయన భాగ్యనగరం వచ్చారు. ఆయనకు హైదరాబాదులో ఘన స్వాగతం లభించింది. ఆయనకు బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ శ్రేణులు స్వాగతం పలికారు.
Recommended Video
లంబాడీ మహిళలు తమ డ్యాన్సులు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికే చోట మొత్తం కాషాయం అలుముకుంది.
ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడారు. దేశద్రోహులకు విధించాల్సిన నగర బహిష్కరణ తనకు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొందరు గడప దాటించాలనుకున్నారని, కానీ తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.
హిందూ సన్యాసిని కాకుండా ఇతర మతంలో ప్రచారకుడిగా ఉండి ఉంటే తనను బహిష్కరించేవారా అని సవాల్ విసిరారు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండి ఈ రోజు భాగ్యనగరం ఎందుకు వస్తున్నారని ఒకరు అడిగారని, హిందూ మహాసముద్రంలో మునగడానికి వస్తున్నానని వారికి చెప్పానని అన్నారు. కాగా, ఆయనకు హైదరాబాద్ పోలీసులు జూలై 9వ తేదీన నగర బహిష్కరణ విధించారు. దానిపై కోర్టుకు వెళ్లడంతో ఊరట లభించింది.