స్వైన్ఫ్లూ లెక్కలపై హైకోర్ట్ సీరియస్.. మరో నివేదిక ఇవ్వాలని సర్కారుకు ఆదేశం.. కేంద్రానికి నోటీసులు
హైదరాబాద్ : ప్రాణాంతక వ్యాధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి రోగాల బారినపడి మరణించిన రోగులకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఇచ్చిన రెండో నివేదికపై న్యాయస్థఆనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రిపోర్టులో స్వైన్ ఫ్లూ సోకి మరణించిన వారి వివరాలు లేకపోవడంపై సీరియన్ అయింది. పూర్తి వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణ మే 8వ తేదీకి వాయిదా వేసింది.
ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్
సుమోటోగా తీసుకున్న హైకోర్టు
స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా తదితర ప్రాణాంతక రోగాల బారిన పడిన పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందకపోవడంతో రోగులు మరణిస్తున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ప్రైవేటు హాస్పిటల్లలో ఆయా వ్యాధుల చికిత్సకయ్యే బిల్లులు భరించలేకపోతున్నారన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు. ఈ లేఖను హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మసనం సుమోటోగా స్వీకరించింది. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సర్కారు నివేదికపై అసంతృప్తి
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తొలుత సమర్పించిన నివేదికపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం తాజాగా 22 పేజీలతో మరో నివేదికను ఇచ్చింది. జిల్లాలవారీగా రోగుల వివరాలు, అందించిన చికిత్స, మలేరియా సోకకుండా తీసుకుంటున్న చర్యల గురించి అందులో ప్రస్తావించింది. అయితే రిపోర్టులో స్వైన్ఫ్లూతో మరణించిన వారి వివరాలు లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
రోగుల లెక్క చెప్పండి?
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 1165 మందికి వ్యాధి సోకినట్లు తేలడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. స్వైన్ ఫ్లూ ఎక్కువగా ప్రబలుతున్న మురికివాడల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. మురికివాడల్లో వైద్య బృందాల సందర్శించాయా? ఎంత మంది స్వైన్ ఫ్లూ రోగులను గుర్తించారు? ఎంత మందికి వైద్య పరీక్షలు చేశారు? ఎందరు మరణించారు తదితర వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీచేసింది.
కేంద్రానికి నోటీసులు
కోర్టు సహాయకుడిగా నియమించిన సీనియర్ లాయర్ ఎస్. నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా ఇంప్లీడ్ చేయాలని ధర్మాసనానికి సూచించారు. ఈ సూచనను స్వీకరించిన ధర్మాసనం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే 8వ తేదీకి వాయిదా వేసింది.