పీవీ మన ఠీవీ.!మాజీ ప్రధానికి తెలంగాణ సర్కార్ సముచిత గుర్తింపు.!నెక్లెస్ రోడ్ లో కాంస్య విగ్రహం ఏర్పాటు.!
హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు సముచితం గౌరవం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పార్టీలు వైరైనా తెలుగు, తెలంగాణకు సంబంధిచిన వ్యక్తి కావడంతో పీవి రాజకీయ సేవలను చిరస్మరణీయం చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీలకతీతంగా వినూత్న గుర్తింపును కల్పించాలని అడుగులు వేస్తోంది. ఈనెల 28న దివంగత మాజీ ప్రదాని పీవీ నర్సింహా రావు జయంతి సందర్బంగా ఆయన కాంస్య విగ్రహాన్ని నెక్లెస్ రోడ్ లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఆర్థిక సంస్కరణల పితామహుడు.. పీవీ కి తెలంగాణ ప్రభుత్వం సరైన గుర్తింపు..
పాములపర్తి వెంకట నర్సింహా రావు జూన్ 28, 1921 అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వంగర గ్రమంలో జన్మించారు. విద్యార్థి దశనుండే ఎటువంటి అన్యాయాన్నైనా ఎదురించే తత్వం కలవాడు పీవి. 1935వ సంవత్సరంలో వందేమాతర గీతాలాపనను అన్ని కాలేజీలలో నిజాం ప్రభుత్వం నిషేందించింది. అందుకు ప్రతీకారంగా 1938 నవంబర్ 16న ఔరంగాబాద్ ఇంటర్ మీడియట్ కాలేజీలో 17సంవత్సరాల పీవీ వందేమాతర గీతాన్ని ఆలపించారు. సామాన్య కుటుంబ నేపథ్యం ఉన్న పీవీ రాజకీయంలో క్రమంగా ఎదుగుతూ ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించారు.
దేశ ఆర్ధిక రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించిన మేధావి.. పీవీ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలంలో విప్లవాత్మక భూ సంస్కరణలు చేపట్టారు పీవీ నర్సింహా రావు. అంతే కాకుండా భారతీయ పరిశ్రమలు పోటీని ఎదుర్కొనే వీలు కల్పిస్తూ అనుమతి పత్రాల వ్యవస్ధను రద్దు చేసి పరిశ్రమల స్థాపనను పీవి నర్సింహా రావు సులభతరం చేసారు. 1992లో సెబీ చట్టాన్ని ప్రవేశపెట్టి, జాతీయ స్టాక్ ఎక్సేంజీలో కంప్యూటర్ ఆధారిత ట్రేడింగ్ ను అమలు చేసిన ఘనత కూడా మన పీవీ నర్సింహా రావుదే. ప్రపంచం మారుతోంది, అందుకు అనుగుణంగా మన దేశం కూడా మారాలి అంటుండే వారు మన పీవీ నర్సింహా రావు.
భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అభివృద్ది చెందడానికి పీవీ కృషి.. తెలంగాణ ముద్దుబిడ్డకు టీ సర్కారం గౌరవం..
కాగా భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అభివృద్ది చెందడానికి ఎంతో కృషి చేసిన పీవీ కి అందుకు తగిన గుర్తింపు లభించలేదు. దివంగత ప్రధాన మంత్రుల అంత్యక్రియలు ఢిల్లీలో యమునా నది ఒడ్డున జరిపి, వారికి ఒక స్మృతి చిహ్నం నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా పీవీ విషయంలో ఇందుకు భిన్నంగా, పీవీ కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో జరిగాయి. ఆ సందర్బంగా పీవీ నర్సింహా రావుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన సముచిత గౌరవం ఇవ్వలేదనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద ఆ అపవాదు అలాగే కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పీవీ కి సముచిత స్దానం కల్పిస్తూ ఆయన సేవలకు గుర్తింపుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 28న పీవీ విగ్రహం ఆవిష్కరణ.. నెక్లెస్ రోడ్ లో శరవేగంగా చోటుచేసుకుంటున్న ఏర్పాట్లు..
ఇదిలా ఉండగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా ఈ నెల 28న ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డును ఇప్పటికే పివిఎన్ఆర్ మర్గ్ గా మార్చిన ప్రభుత్వం, ఈ మార్గం ప్రారంభంలోనే ఈ విగ్రహాన్ని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేయనుంది. 16 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉండనుండగా సుమారుగా 2 టన్నుల బరువు ఉండనుంది. దీని తయారీలో 85శాతం కాపర్, 5శాతం జింక్, 5శాతం లెడ్ ను ఉపయోగించారు. దేశంలో పీవి తీసుకొచ్చిన ఆర్దిక సంస్కరణలకు గుర్తింపుగా ఆయన స్మృతి కార్యక్రమాలను ప్రతియేడు నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కార్ స్పస్టం చేస్తోంది.