చిల్లర రాజకీయాలు మానుకో: బాబుపై తలసాని ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. శ్రమ, పట్టుదల, కృషి వల్లే కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించామని పేర్కొన్నారు.
కంటోన్మెంట్లో గెలుపు కోసం చంద్రబాబునాయుడు పార్టీ బ్రోకర్లకు రూ. 5 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఇకనైనా చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సమితి లేదన్న నేతలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదని తెలిపారు. పని చేసే వారికి ప్రజలు పట్టం కడతారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. కంటోన్మెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ సత్తా చాటిందని చెప్పిన తలసాని.. కంటోన్మెంట్ ఛైర్మన్ ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
సనత్నగర్ ఉప ఎన్నికల్లో తేల్చుకుందామని చెప్పిన చంద్రబాబు ఏజెంట్ల సత్తా తెలిసిందని తలసాని అన్నారు. టిడిపి బలమెంటో కంటోన్మెంట్ ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. టిడిపితో తాడోపేడో జిహెచ్ఎంసి ఎన్నికల్లో తేల్చుకుంటానని సవాల్ విసిరారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి పత్తాలేకుండా పోతుందని అన్నారు.
క్రీడాకారుల సహాయార్థం జీహెచ్ఎంసీ నూతన పథకం
పదవి విరమణ చేసిన క్రీడాకారుల సహాయార్థం జిహెచ్ఎంసీ అధికారులు ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. జిహెచ్ఎంసీలో పనిచేసి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వృద్ధ క్రీడాకారులకు ఇకనుంచి ప్రతినెల రూ.10 వేలను అందించనున్నారు.
ఈ పథకం అమలులో భాగంగా జీహెచ్ఎంసీ మొదటి విడతగా 10 మంది క్రీడాకారులను గుర్తించింది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు కె తారక రామారావు, పద్మారావు చేతుల మీదుగా ఎంపిక చేసిన క్రీడాకారులకు జిహెచ్ఎంసి చెక్కులను అందించనుంది.