దానం ఇంటికి తలసాని, కలకలం: ఆంధ్రకు నీళ్లు రావనే: జూపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షులు, మాజీ మంత్రి దానం నాగేందర్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
దానం నాగేందర్ పార్టీ మారనున్నారని, టీఆర్ఎస్లో చేరనున్నారని, సరైన సమయం కోసం చూస్తున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని దానం మాత్రం కొట్టిపారేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం అధికార పార్టీలో చేరిన డి శ్రీనివాస్కు దానం సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఆయన కూడా డిఎస్ దారిలోనే నడుస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన చెబుతున్నారు.

గురువారం సాయంత్రం దానం ఇంటికి తలసాని వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఇటీవల దానం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం లేదనే వాదనలు ఉన్నాయి. అయితే, సికింద్రాబాద్ మహంకాళీ బోనాల జాతరకు ఆహ్వానించేందుకే దానంను తలసాని కలిశారని చెబుతున్నారు.
చంద్రబాబు అడ్డుపుల్ల: జూపల్లి
రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులను ఎవరు అడ్డొచ్చినా అడ్డుకోలేరని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి అఖిలపక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాజీ ఎంపీ మంద జగన్నాథం అధ్యక్షతన అలంపూర్ చౌరస్తాలో జరిగిన ఈ సమావేశానికి ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు వల్ల ఏపీకి నీరందదనే దురుద్దేశంతోనే కేంద్రానికి ఆంధ్రాబాబు చంద్రబాబు లేఖ రాశారన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణ ప్రాంత సభ్యుడు ఉండటం వల్లే, గతంలో ఎన్నడూ రాని విధంగా నేడు లక్ష ఎకరాలకు సాగునీరందుతున్నదన్నారు. కేంద్రానికి బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు బహిరంగ చర్చకు ఎందుకు రావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications