వదులుతున్నాకాచుకో: బాబుకు తలసాని సవాల్
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో స్టీఫెన్సన్తో మాట్లాడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పగలరా? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలపై తానూ ఓ అస్ర్తం వదులుతున్నానని అన్నారు. పరిటాల కేసులో ముద్దాయిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పెద్దల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తేలితే టీడీపీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని సవాల్ విసిరారు. ఏపీ నేతల ఇంటి వద్ద సెక్యూరిటీని మార్చుకుంటామంటున్నారని అంటూ మరి కరెంట్, నీళ్లను ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని తలసాని ప్రశ్నించారు.
ఓటుకు నోటు స్కాంలో దొరికిపోయిన చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం హేయమని తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయక ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టొద్దని అన్నారు. హైదరాబాద్లో హాయిగా జీవిస్తున్న ఏపీ ప్రజల్లో అభద్రతావాతావరణం సృష్టించడం దురదృష్టకరమన్నారు. తప్పు ఒప్పుకోకుండా ప్రజల్లో అశాంతి రగిల్చేందుకు జరుగుతున్న కుట్రలను సహించబోమని మంత్రి తలసాని హెచ్చరించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను తవ్వుకున్న బొందలో తానే పడ్డాడని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. చేసిందంతా చేసి ఇపుడు దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అరిచినట్టు వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. హైదరాబాద్ తమ జాగీరు అని చంద్రబాబు చెప్పడంపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి హాజరైన పోచారం మీడియాతో మాట్లాడారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎదుటి వారిపై బురదచల్లడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పోచారం అన్నారు.












Click it and Unblock the Notifications