’ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా’: మంత్రి తలసానిపై కోమటిరెడ్డి
హైదరాబాద్: కురువుపై తెలంగాణలో బుధవారం వాడి వేడి చర్చ జరిగింది. ధనిక రాష్ట్రంలో రైతు ఏం పాపం చేశాడని, కరువుతో అల్లాడుతున్న అన్నదాతను ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశాయి.
ఈ చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఉద్దేశించి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలు సభలో కొద్దిసేపు గందరగోళాన్ని సృష్టించాయి. జీవన్ రెడ్డిని ఏకవచనంతో తలసాని సంబోధించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బుధవారం కరువుపై చర్చ జరుగుతున్న సందర్భంలో జీవన్రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మంత్రి తలసాని ఏదో అనటంతో.. 'కరువు కష్టాలు మాకు తెలుసు సిటీలో ఉండే తలసానికి ఏం తెలుసు' అని జీవన్రెడ్డి అన్నారు. దీంతో కలుగజేసుకున్న శ్రీనివాసయాదవ్ 'ప్రపంచంలో ఈయనొక్కడే మేధావి అయినట్టు, ఆయనొక్కడే వ్యవసాయం చేస్తున్నట్టు, ఊళ్లన్నీ ఈయనే తిరుగుతున్నట్టు, ఆయనేదో పొడిచేసినట్టు, మేమేదో పొడవకుండా ఉన్నట్టు.. ఏం విమర్శలు' అంటూ జీవన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.
దీంతో కాస్త అసహనానికి గురైన జీవన్రెడ్డి.. 'నేను చెప్పేవన్నీ నిజాలు, రాజకీయాలు చేయాలంటే బాగా చేస్తాం.. 1981లోనే సమితి అధ్యక్షుడిగా ఉన్నా..' అని అన్నారు. ఈ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడినప్పుడు మంత్రి తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'జీవన్రెడ్డి సీనియర్ సభ్యుడు, ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గౌరవిస్తారు. ఏకవచన సంబోధనతో ఆయనను నువ్వుగివ్వు అనడం, పొడిచేస్తాడా అనటం మంచి పద్ధతి కాదు. మోండా మార్కెట్ నుంచి వచ్చిన శ్రీనివాసయాదవ్ అలా మాట్లాడొద్దు, కనీసం జీవన్రెడ్డి వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.