సిఎం కెసిఆర్ కలలను నిజం చేయాలి, సహకరించాలి: తనికెళ్ల భరణి
మహబూబ్నగర్: అందరూ సమిష్టిగా కృషిచేసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కలలుగంటున్న బంగారు తెలంగాణకు సహకరించాలని ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సూచించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా దేవరక్రద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
పాలమూరు జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందడానికి జిల్లావాసులంతా సమిష్టిగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2011లో అడ్డాకుల మండలంలో కందూరు రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి కొత్త అనుభూతికి గురయ్యానని చెప్పారు.
ఆలయ చరిత్రను రాయించడం లేదంటే స్వయంగా రచిస్తానన్నారు. దేశంలో ఎనిమిది జ్యోతిర్లింగాలకన్నా కందూరు రామలింగేశ్వరుని స్వామి ఆలయమే మహా శక్తి వంతమైందన్నారు. స్వామి వారి ఆలయం కోనేరు చుట్టూ 27 కల్ప (కదంబ) వృక్షాలు ఉండడం వల్ల సాక్షాత్తు పార్వతీ, సరస్వతీ మాతల శక్తి పీఠమన్నారు.
అంతేగాక, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ సహకారాలతో ఆలయాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు భరణి. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి జేపీఎన్సీ కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు.