కేసీఆర్ అహంకారానికి అంతం హుజూరాబాద్ తీర్పు, హరీశ్ రావునూ గెంటేస్తారు: బీజేపీ నేతలు
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా తరుణ్ ఛుగ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ కుటుంబం హుజూరాబాద్ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అవమానించిందని, కుక్కను పెట్టినా గెలుస్తామని అన్నారని మండిపడ్డారు.
కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా హుజూరాబాద్ తీర్పు: తరుణ్ ఛుగ్
ఈ ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉండబోతోందన్నారు తరుణ్ ఛుగ్. రాజరిక, దోపిడీ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందని తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లతో కుమ్ముక్కయిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఈటల గెలిస్తే హుజూరాబాద్లో 60 రోజుల్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తి చేయడంతోపాటు గ్రామీణ సడక్ యోజన నిధులు తీసుకొస్తామని, హుజూరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని తరుణ్ ఛుగ్ వివరించారు. ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంటూ కిషన్ రెడ్డి ఫైర్
మరోవైపు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు ఉండొచ్చు.. అవి చాలా సహజం.. కానీ వాటిని అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజార్చేలా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన హనుమకొండ జిల్లా పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘంపై కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే లు.. ఎవరి ప్రచారాలను కూడా అడ్డుకోవడం లేదన్నారు. నిబంధనలు అందరికీ సమానమే అన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజలు బీజేపీని గెలిపించాలని డిసైడ్ అయ్యే ఉన్నారని పేర్కొన్నారు. గెలుపు ఓటములు గురించి కాదు ఈ ఎన్నిక, ఈటల రాజేందర్ కు మెజారిటీ ఎంత వస్తున్నదని జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి.
Recommended Video
హరీశ్ రావే చెల్లని రూపాయి.. కేసీఆర్ గెంటేస్తారంటూ విజయశాంతి
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా టీఆర్ఎస్ సర్కారు, మంత్రి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మెదక్లో చెల్లని రూపాయి హుజురాబాద్లో చెల్లుతుందా? అని.. మంత్రి హరీశ్ చేసిన కామెంట్స్పై స్పందించారు. హరీశ్ రావే చెల్లని రూపాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు అన్నీ తానై వ్యవహరించిన దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిందని.. ఇప్పుడు హుజురాబాద్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోబోతుందని చెప్పారు. హరీశ్ రావు ఏ షూటర్ కాదని.. పార్టీలో ఆయనకు గౌరవమే లేదన్నారు. హుజురాబాద్ లో ఈటల మంచి మెజార్టీతో గెలుస్తారన్నారు. అంతేగాక, 2009 ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కోసం సిరిసిల్లలో ప్రచారానికి వెళ్తుంటే తనను హరీశ్ రావే అడ్డుకున్నారని తెలిపారు. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటు. అందుకు మొదట హరీష్ రావు ముక్కు నేలకు రాసి దళితులకు క్షమాపణ చెప్పి ఉండాలి. ఇంతవరకూ చెయ్యలే.. ఇక హరీష్ రావు దళిత బంధు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే... దళితద్రోహి కేసీఆర్కి, దళితద్వేషి హరీష్ రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టవలసిన సందర్భం ఇది. ఈ హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కూడా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుంచి కేసీఆర్ బయటకు వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామమని విజయశాంతి జోస్యం చెప్పారు.