సిఎం బస్సుకు పన్ను మినహాయింపు: ఆస్పత్రి రోగులకు విలాస పన్ను పోటు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల్లో పర్యటించేందుకు కొత్తగా కొనుగోలు చేసిన బస్సుకు ఎంట్రీ ట్యాక్స్ మినహాయింపు లభించింది.
ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఈ బస్సుకు వాస్తవానికి ఎంట్రీ లెవీ ట్యాక్స్ కింద రూ. 37,66,829 మేర చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఈ ట్యాక్స్ను మినహాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ సిఎం నారా చంద్రబాబునాయుడితో పాటు తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా తన జిల్లా పర్యటనల కోసం దాదాపు రూ. 5 కోట్లు వెచ్చించి బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఆస్పత్రి రోగులకు విలాస పన్ను పోటు
తెలంగాణలో కార్పొరేటు ఆస్పత్రులకే పరిమితమైన విలాస పన్ను(లగ్జరీ టాక్స్).. ఇక అన్ని ఆస్పత్రులకూ వర్తించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ఏ ఆస్పత్రి అయినా చికిత్స తీసుకుంటున్న రోగికి కేటాయించిన గదికి రూ.500.. ఆ పైన ఛార్జీ చేసినట్లయితే దానిపై లగ్జరీ ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
గదికి వేసే ఛార్జీపై దాదాపు పదిశాతం మేరకు ఈ పన్ను ఉంటుందని వాణిజ్యపన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అనుసరించి తెలంగాణ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ లగ్జరీ పన్ను నిబంధనలు, 1987ను అడాప్టు చేసుకుని.. దానికి కొన్ని సవరణలు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే ఆ సవరణల్లో భాగంగా కార్పొరేటు ఆస్పత్రులు అన్న పదానికి బదులుగా ఆస్పత్రులు అన్న పదం సూచించింది. దీంతో కార్పొరేటుకే పరిమితమైన లగ్జరీ పన్ను.. ఇకపై అన్ని రకాల ఆస్పత్రులకూ వర్తించినట్లయింది. ఇప్పటివరకు కార్పొరేటు ఆస్పత్రుల్లో లగ్జరీ పన్నును రూ.500 చార్జి దాటిన గదులపై వేస్తున్నారు. దాదాపు రూ. 10 శాతం మేరకు ఇది ఉంటుంది. ఈ లగ్జరీ పన్ను కూడా చివరగా రోగులే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
తాజా సవరణతో అన్ని ఆస్పత్రులకూ ఇది వర్తిస్తుంది. గాంధీ, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో యూజర్ చార్జీలు లేనందున.. వీటిపై లగ్జరీ ట్యాక్స్ పడదు. అయితే నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలువసూలు చేస్తున్నందున.. ఈ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునే పేదలపై లగ్జరీ ట్యాక్స్ భారం పడే అవకాశం ఉంది.
మరోవైపున కార్పొరేటు ఆస్పత్రులకే పరిమితమైన లగ్జరీ పన్ను అన్ని ఆస్పత్రులకు విస్తరించడంతో.. జిల్లా స్థాయి మొదలుకుని.. హైదరాబాద్ వరకు ఉన్న చిన్న, పెద్ద ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో లగ్జరీ ట్యాక్స్ను ఇక నుంచి వసూలు చేస్తారు.