మా ఆఫీస్లో దౌర్జన్యం, దాడి చేశారు: కేసీఆర్కు రేవంత్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. అసెంబ్లీలో టీడీఎల్పీ కార్యాలయం గదుల మార్పు అంశం గవర్నర్ దృష్టికి తెచ్చారు. అనంతరం టిడిపి శాసన సభా పక్ష నేత రేవంత్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.
సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్దే అన్నారు. స్పీకర్ ఆఫీస్ను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీలో తమ కార్యాలయంలోకి దౌర్జన్యంగా వచ్చారన్నారు.
సిబ్బందిపై దాడి చేసి తమ వస్తువులను చిందరవందరగా పడేశారన్నారు. స్పీకర్, టీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారికి మీ తప్పుడు పనులను వారసత్వంగా ఇవ్వొద్దని హితవు పలికారు.

మరో టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ.. తెరాస అప్రజాస్వామిక విధానాలను గవర్నర్కు వివరించామన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు నుంచి టీడీఎల్పీ ఆఫీస్ వివాదం వరకు అన్ని అంశాలను గవర్నర్కు వివరించామన్నారు.
ఈ వ్యవహారంపై స్పీకర్తో మాట్లాడాలని కోరామని చెప్పారు. గతంలో ఒక సభ్యుడున్న పార్టీలకూ గదులు కేటాయించారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గుర్తు చేశారు. తాము ఎక్కడ కూర్చోవాలో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్దే అన్నారు.












Click it and Unblock the Notifications