తెలంగాణలో బీజేపీని చంద్రబాబు గట్టెక్కిస్తారా ? ఆ అద్భుతం జరగాల్సిందే- లేకుంటే కేసీఆర్ సేఫ్ !
ఏపీ రాజకీయాల్లో నామమాత్రంగా మారిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చంద్రబాబు.. అదే సమయంలో హైదరాబాద్ లోనూ ఎక్కువ సమయం గడుపుతూ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబును దగ్గరకు తీసుకుంటోంది. అయితే చంద్రబాబుతో పొత్తు ఉంటుందా లేదా అన్నది పక్కనబెడితే.. గతంలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో లాభపడ్డ కేసీఆర్ అనుభవం మాత్రం కాషాయ సేనను ఆలోచనలో పడేస్తోంది.

తెలంగాణ ఎన్నికల రాజకీయం
వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోబోతున్న తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంటూ ప్రజావ్యతిరేకతను కూడగట్టుకున్న కేసీఆర్ ను ఎలాగైనా గద్దెదింపేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న బండి సంజయ్ అండ్ కో .. ఇప్పుడు ఏపీలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును సైతం వాడేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి కాస్తో కూస్తో మిగిలిన క్యాడర్ బలంతో పాటు హైదరాబాద్ లో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో భారీ ట్విస్టులు తప్పేలా లేవు.

చంద్రబాబును కలిపేసుకుంటున్న బీజేపీ
వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే పరిస్ధితుల్లో ఉన్న టీడీపీని దగ్గరకు తీసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య ప్రధాని మోడీ పలు కార్యక్రమాలకు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే బీజేపీ నేతల నుంచి టీడీపీపై విమర్శల దాడి కూడా ఆగిపోయింది. తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారం అందుకునేందుకు కాషాయ సేన వ్యూహరచన చేస్తోంది. ఇందుకు చంద్రబాబు కూడా సై అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. అక్కడే తెలంగాణలో రాబోయే రాజకీయానికి సంకేతాలు ఇచ్చేశారు.

కాంగ్రెస్ కు ప్రయోజనం
గతంలో 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని దారుణంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి మాత్రం చంద్రబాబు-బీజేపీ పొత్తు కోసం జరుగుతున్న ప్రయత్నాలతో సంతోషంగానే ఉంది. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న తమను కేసీఆర్.. ఆంధ్రాపార్టీలతో స్నేహం పేరుతో జనంలో సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓడించారనే ఆవేదన కాంగ్రెస్ లో ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ మౌనం పాటిస్తోంది. ఎన్నికల నాటికి బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఫోకస్ కూడా వారిపైనే ఉంటుంది. దాన్ని తాము సద్వినియోగం చేసుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఆ అద్భుతం జరగాల్సిందేనా ?
గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ఆంధ్రా సెంటిమెంట్ పేరుతో చివరి నిమిషంలో జనంలో టార్గెట్ చేసిన కేసీఆర్.. 2018 ఎన్నికల్లో గట్టెక్కారు. ఇప్పుడు బీజేపీని మోడీ పేరుతో టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. రేపు చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఆంధ్రా పార్టీలతో పొత్తు పేరుతో టార్గెట్ చేయడం ఖాయం. అప్పుడు దాన్ని అధిగమించేందుకు బీజేపీ ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై కేసీఆర్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రజల్లో వ్యతిరేకత పెంచుకున్న కేసీఆర్ రేపు ...ఆంధ్రా పార్టీ టీడీపీతో పొత్తా అనే సెంటిమెంట్ ను ప్రయోగిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపైనా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా సెంటిమెంట్ కంటే కేసీఆర్ పై వ్యతిరేకతే నిజమని జనాన్ని నమ్మించగలిగితే మాత్రం కచ్చితంగా తెలంగాణలో అధికారం అందుకోవచ్చనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అదే జరిగితే కేసీఆర్ కు ఇది భారీ టర్నింగ్ పాయింట్ కానుంది.












Click it and Unblock the Notifications