బిసిలకు టిడిపి 63శాతం టిక్కెట్లు, బిజెపి డైలమా: టిఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ టిక్కెట్లు
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. పలు డివిజన్ల నుంచి అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించి ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు.
రెండు వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఈ నెల 21వ తేదీ వరకు ఉంది. ఫిబ్రవరి 2న పోలింగ్ జరగనుంది. 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అధికార తెరాస పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. అయితే, పలువురు ఆశావహులు అసంతృప్తికి గురయ్యారు. వారిని పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కొందరు చివరి నిమిషంలో టిక్కెట్ కోసం ఇతర పార్టీలలో కూడా చేరారు. కొందరు టిక్కెట్ దక్కించుకున్నారు కూడా.
చివరి నిమిషాలో జాబితా విడుదల చేసిన టిడిపి
జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టిడిపి ఆదివారం చివరి నిమిషంలో విడుదల చేసింది. శనివారం రాత్రి బిజెపి, టిడిపి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. టిడిపి 87 స్థానాల్లో, బిజెపి 63 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి.
ఈ నేపథ్యంలో టిడిపి 82 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. మరో అయిదుగురిని ప్రకటించవలసి ఉంది. టిడిపి జాబితా విడుదల చేసిన కొన్ని నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 94 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. టిడిపి బిసిలకు 63 శాతం సీట్లు కేటాయించింది.
తమ అభ్యర్థులకు తెరాస ఏదైనా ఆశ చూపించి బరిలో నుంచి తప్పించడమో లేక మరేదైనా చేస్తుందనే భయంతో విపక్షాలు అభ్యర్థుల విషయంలో ఆచితూచి ముందుకు సాగుతున్నాయి. బిజెపి అయితే ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ ప్రక్రియ పూర్తయినా బిజెపి అభ్యర్థులను ప్రకటించక పోవడం గమనార్హం.
ఇప్పటికే అభ్యర్థులకు ఫోన్ చేసి నామినేషన్ దాఖలు చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీ వరకు బిఫారం ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో తాము అనుకునే అభ్యర్థులకు ఈ లోపు బిఫారం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
టిడిపి - బిజెపికి ఎక్కువగా రెబల్స్ బెడద
గ్రేటర్ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువగా టిడిపి, బిజెపిలకే రెబల్స్ బెడద ఉందని తెలుస్తోంది. అధికార తెరాస అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నందున అసంతృప్తులు కొంత తక్కువగా ఉన్నారు. అయితే, బిజెపి - టిడిపి మిత్రపక్షాలైనందున ఆ పార్టీలకు ఎక్కువగా రెబల్స్ బెడద కనిపిస్తోంది.
తెరాస నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు
కాంగ్రెస్ పార్టీ నాగోల్ అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చింది. తొలుత వనజను అనుకున్నారు. ఆ తర్వాత తెరాసలో టిక్కెట్ ఆశించి భంగపడిన పుష్పలత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. కొత్తపేట అభ్యర్థిగా తెరాస నుంచి వచ్చిన లింగాల రాహుల్ గౌడ్కు టిక్కెట్ ఇచ్చారు.