బాబు టీడిపిని ఎన్టీఆర్ ఫామిలీకి ఇవ్వాలి!బండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు!ఆర్ కృష్ణయ్య తోపా?కేఏ పాల్ ప్రశ్నల వర్షం!
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు కేఏ పాల్ మళ్లీ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు ఏపీ రాజకీయాలను ప్రస్తావించారు. చంద్రబాబుతో పాటు వైయస్ జగన్మోహన్ రెడ్డి విధానాలను విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడు సందర్బంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు పాల్. తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్ క్రిష్ణయ్యకు అంత సీన్ లేదని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో వేసుకున్న అంచనాలు తారుమారవుతాయన్నారు కేఏ పాల్.
తెలంగాణలో శాంతియుతంగా ఉన్న అన్ని మతస్థులను, తన వ్యాఖ్యల ద్వారా రెచ్చగొట్టి తెలంగాణలో శాంతి లేకుండా చేయాలనుకుంటున్నారని, తద్వారా బండి సంజయ్ తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నాడని డాక్టర్ కె ఏ పాల్ ఘాటుగా విమర్శించారు. వెంటనే బిజెపి కేంద్ర నాయకత్వం బండి సంజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కుటుంబంలో ఒకరైన, బాలకృష్ణకు గానీ జూనియర్ ఎన్టీఆర్ కి గాని ఆ పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య బీసీ ప్రజానికానికందరికీ ఏమైనా ప్రతినిధా అని ప్రశ్నించారు. ఒక్క ఆర్.కృష్ణయ్య కు జగన్ రాజ్యసభ సీటు ఇచ్చినంత మాత్రాన బీసీలందరూ కళ్లు మూసుకుని గుడ్డి వాళ్ళ లాగా జగన్ కు ఓటేస్తారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు కేఏ పాల్.