ఏపీ పాలకులు ఎన్ని కుట్రలు చేశారో చూడండి: గూగుల్లో చూపించిన కెసిఆర్, రికార్డ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన తెలంగాణ శాసన సభలో గురువారం నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టుల పైన సమైక్య పాలకులు కుట్రలు పన్నారని చెప్పారు.
మహారాష్ట్ర వాళ్లు ఇప్పటికే పెన్ గంగ పైన 31 బ్యారేజీలు పూర్తి చేశారన్నారు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇబ్బడిముబ్బడిగా ప్రతి చోట వారు బ్యారేజీలు కట్టారన్నారు. బ్యారేటీ కట్టే పరిస్థితులు లేకుంటే లిఫ్టులు పెట్టుకున్నారని చెప్పారు.
దీంతో మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిండిన తర్వాత కానీ మనకు నీళ్లు రావన్నారు. ఇదేంటని అడిగితే మా పరిధిలో మేం నిర్మిస్తున్నామని చెప్పారన్నారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల మనకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఇలా ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కడుతున్నారని, ఇప్పుడు తెలంగాణను ఎవరు కాపాడుతారన్నారు. నీటి కోసం మహారాష్ట్ర వాళ్లు చిన్న అవకాశం కూడా వదలలేదని చెప్పారు. అన్ని నదుల పైన మహారాష్ట్ర 450 ప్రాజెక్టులు కట్టిందన్నారు.
తాను గూగుల్ మ్యాప్ ద్వారా అన్నింటిని పూర్తిగా స్టడీ చేశానని చెప్పారు. ఈ వివరాలన్నీ అడిగితే ఇవ్వరని, మేమే కష్టపడి సేకరించామన్నారు. మహారాష్ట్ర నిర్మించిన ప్రాజెక్టులను మనం ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. మంజిరా, ఎస్సారెస్సి, శ్రీశైలంలోకి చుక్క నీరు రాకపోవడానికి మహారాష్ట్ర ప్రాజెక్టులు కారణమని చెప్పారు.
తెలంగాణపై చేసిన కుట్రలు నమ్మలేరు
తెలంగాణ పైన చేసిన కుట్రలు చెబితే నమ్మలేకుండా ఉంటాయన్నారు. కిన్నెరసాని కింద మన గిరిజనులు ఉంటారని, అతిపెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు మాకు నీళ్లు ఇవ్వాలని అడిగారని, కానీ ఇవ్వరని చెప్పారు. 1960లో కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మించారన్నారు.
కిన్నెరసాని వద్ద మానవ సంచారం ఉండవద్దని, తెలంగాణకు లాభం ఉండవద్దని, ఆ ప్రాంతాన్ని వన్యపాణి సంరక్షణ జోన్ కింద పెట్టారన్నారు. అందేకాదు, కిన్నెరసాని ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల దూరాన్ని ఎకో జోన్ అని పెట్టారన్నారు. తద్వారా తెలంగాణకు నష్టం చేసే కుట్ర చేశారన్నారు.
రాజీవ్ సాగర్ ద్వారా నీరు ఇస్తామని చెప్పారని, కానీ దానిని పక్కన పడేశారన్నారు. పనులు ప్రారంభం కాకముందే రూ.750 కోట్లు దోచుకున్నారన్నారు. నేను చెప్పే నిజాలు గూగుల్ మ్యాప్ చూస్తే ఎవరికైనా కనిపిస్తాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి నీళ్లు తేవాలా వద్దా చెప్పాలన్నారు. ఖమ్మంలోని మన ప్రజలకు న్యాయం జరగవద్దా అని ప్రశ్నించారు.
దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్
దేవాదుల ప్రాజెక్టుకు రూ.8వేలకోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. ఇక్కడ గోదావరి నదిలో నీళ్లు పారినా కూడా పంప్ హౌస్లోకి నీళ్లు రావాన్నారు. 2001లో నేను తెలంగాణ కోసం ఉద్యమించాక.. నాటి సీఎం తాపీ మేస్త్రీని కూడా తీసుకెళ్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారన్నారు.
దేవాదుల ప్రాజెక్టు 170 రోజుల పాటు నీళ్లు తీసుకోవాలని, కానీ అలా లేదన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఆరు లక్షలకు పైగా ఎకరాలకు పైగా వ్యవసాయాన్ని ప్రతిపాదించారన్నారు. కానీ రెండు నెలలు కూడా నీళ్లు రావన్నారు. ఈ ప్రాజెక్టును కాంతనపల్లి వద్ద కట్టారని, దీంతో గిరిజనుల భూములు మునుగుతాయన్నారు.
గిరిజనులు భూములు ఇవ్వరు, చత్తీస్గడ్ ఒప్పుకోదని, అందుకే తాము దేవాదులను రీడిజైన్ చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేసి వరంగల్ జిల్లాకు నీళ్లు తెచ్చుకోవద్దా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పునరాకృతి వల్ల ముంపు ప్రాంతం బయటపడే అవకాశముందన్నారు.
వలసల జిల్లా పాలమూరు, నల్గొండ ఫ్లోరైడ్తో సతమతమవుతాం
దక్షిణ తెలంగాణకు పోతే.. మహబూబ్ నగర్ జిల్లాను వలసల జిల్లా అంటారన్నారు. లక్షలాది మంది వలస పోతారన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్తో సతమతమవుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పక్కన ఉంటుందని, కానీ ఎక్కడో గోదావరి నీటితో దానికి లింకప్ చేశారని మండిపడ్డారు.
ఎస్ఎల్బీసీ
ఎస్ఎల్బీసీ ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ అన్నారు. 44 కిలోమీటర్ల టన్నెల్ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల పైన ఎన్నో చర్చలు జరుగుతాయి కానీ తెగయన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు.. దీనిని సొరంగమా చేద్దామా అనే చర్చ సాగిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు చర్చకే పరిమితమయ్యాయన్నారు. ఎస్ఎల్బీసీ ఎన్నేళ్లకు పూర్తి కావాలన్నారు.
కల్వకుర్తిలో లిఫ్టులు మాత్రమే పెట్టారని, నిల్వ సామర్థ్యం లేదన్నారు. మేం కల్వకుర్తి ఎత్తిపోతలను పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుత సీజన్ ద్వారా కల్వకుర్తి ద్వారా లక్షన్నర ఎకరాలకు నీటిని ఇస్తామని చెప్పారు. భీమా ప్రాజెక్టును 2017కు పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్డీఎస్లో మనకు అన్యాయం జరిగిందని, నెట్టెంపాడు పూర్తయ్యే దశలో ఉందని చెప్పారు.
కెసిఆర్ రికార్డ్
తెలంగాణ అసెంబ్లీలో వరుసగా మూడు గంటల పాటు ఏకథాటిగా మాట్లాడిన సీఎం కేసీఆర్ రికార్డు నెలకొల్పారు. తెలంగాణ జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించిన ఆయన మూడు గంటలపాటు ప్రసంగిస్తూనే ఉన్నారు. రోజు ఉదయం 11.45 గంటల సమయంలో ప్రారంభమైన ఆయన ప్రసంగం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ముగిసింది.