రోడ్డు ప్రమాదంలో టెక్కీ దుర్మరణం: వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగుడా వద్ద ఈ ప్రమాదం సంభవించింది. దిల్షుక్నగర్కు చెందిన సతీష్ (27) ఇన్పోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.
శుక్రవారం ఉదయం బైక్పై బయలుదేరిన సతీష్ అన్నోజిగుడా వద్ద ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతను శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. బైక్ అదుపు తప్పడంతో సతీష్ మరణించాడా, మరేదైనా వాహనం ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ తగాదాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం చించెన్పల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పల్గుట శ్రీశైలం, లక్ష్మి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఏడాదిన్నర వయస్సు గల కుమారుడు ఉన్నాడు.
శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి పురుగుల మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీశైలం భార్య అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసింది.