టెక్కీ మృతి: ఫ్యామిలీ కన్నీరు మున్నీరు (ఫోటో)
హైదరాబాద్: ప్రేమికుల రోజున సాఫ్టువేర్ ఇంజనీర్ సుప్రియ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి నేపథ్యంలో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు రోజుల క్రితం సాయంత్రం యాప్రాల్లోని ఇంటికి సుప్రియ మృతదేహం తీసుకురాగానే బంధువులు, కాలనీవాసులు చేరుకొని విలపించారు. అనంతరం యాప్రాల్ శ్మశాన వాటికలో సుప్రియ భౌతికకాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు.
కాగా, తాను పని చేస్తున్న కంపెనీ భవనం పై నుండి కిందపడి సాఫ్టువేర్ ఉద్యోగిని సుప్రియ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన హైదరాబాదులోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ సాయికృపా కాలనీకి చెందిన సుదర్శన్ కుమార్ కూతురు సుప్రియ సాఫ్టువేర్ ఇంజనీర్. ఆమె రెండు రోజుల క్రితం మృతి చెందారు. దీని పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆమెకు సన్నిహితుడు అయిన కిరణ్ను పోలీసులు విచారించారు. సుప్రియ మృతి చెందిన రోజు రాత్రి ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ రోజు రాత్రి ఉన్న తోటి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. ప్రేమికుల రోజు బహుమతి విషయంలో కిరణ్, సుప్రియల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది.కిరణ్ అక్కడి నుండి వెళ్లిపోగా.. సుప్రియ ఎక్కడకు వెళ్లింది, తర్వాత తానే మనస్తాపంతో దూకిందా లేక ఎవరైనా తోశారా అనే విషయం తేలాల్సి ఉంది.
ప్రాథమిక విచారణను బట్టి సుప్రియ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. సుప్రియ హైటెక్ సిటీ సైబర్ పెరల్ భవనంలోని ఓ ఐటీ కంపెనీలో ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం కంపెనీకి వచ్చిన సుప్రియ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో టీ విరామానికి బయటకు వెళ్లారు. అరగంట తర్వాత మళ్లీ కంపెనీలోకి వచ్చారు.
ఆ తర్వాత రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కంపెనీ భవనం బయటకు వెళ్లే మార్గంలో కింద గాయాలతో సుప్రియ పడి ఉన్నారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ రాత్రి రెండున్నర గంటలకు మృతి చెందారు.